పెళ్లిరోజు గిఫ్ట్గా హీరోయిన్కు విడాకుల నోటీసు... భర్త వేధింపులతో అర్ధరాత్రి ఆ నిర్ణయం
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ తరహా సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా ఆదరణ లభిస్తోంది. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త సిస్టర్ నివేదిత జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్లో బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ లీడ్ రోల్లో నటించనున్నారని మేకర్స్ ప్రకటించారు. గడిచిన 15 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఒక్కసారిగా ఈ క్రేజీ ఆఫర్ దక్కించుకోవడంతో సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. ఇంతకాలం సెలీనా ఏమైపోయింది? ఉన్నపళంగా ఈ ఆఫర్ ఎలా దక్కించుకుంది? అంటూ అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రీ ఎంట్రీపై సెలీనా జైట్లీ ఎమోషనల్ అయ్యారు. తన విడాకులకు దారి తీసిన పరిస్ధితులు, భర్త వేధింపులపై షాకింగ్ కామెంట్స్ చేశారు సెలీనా జైట్లీ. ఈ వివరాల్లోకి వెళితే..
పంజాబీ తండ్రికి, క్రైస్తవ తల్లికి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో జన్మించారు సెలీనా జైట్లీ. తల్లీ- తండ్రి తరపు వారిలో చాలామంది అవిభక్త భారతదేశంలోని బ్రిటీష్ సైన్యంలో పనిచేశారు. మిలటరీ నేపథ్యం ఉండటంతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగారు సెలీనా. 23001లో మిస్ ఇండియా కిరీటాన్ని సాధించిన ఈ ముద్దుగుమ్మ.. అనంతరం మిస్ యూనివర్స్లో ఫోర్త్ రన్నరప్గా నిలిచారు. 2003లో హిందీ చిత్రం జనషీన్తో వెండితెరపై అడుగుపెట్టారు. తెలుగులో మంచు విష్ణు సరసన సూర్యం సినిమాలో నటించారు. ఆపై హిందీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ఆమె.. నో ఎంట్రీ, అప్నా అప్నా మనీ మనీ, గోల్మాల్ రిటర్న్స్, థాంక్యూ తదితర సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్లో తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించారు సెలీనా.

కెరీర్ పీక్స్లో ఉండగానే 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్ను పెళ్లాడారు. 2012లో వీరికి విన్స్టన్, విరాజ్ అనే కవల మగపిల్లలు జన్మించారు. ఆ తర్వాత మరోసారి 2017లో ఇద్దరు కవల పిల్లలకు సెలీనా జన్మనిచ్చారు. వీరికి ఆర్ధర్, షంషేర్ అని పేరు పెట్టుకున్నారు. వీరిలో షంషేర్ అనే బాబు గుండె సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశాడు. వివాహం, పిల్లలు, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో భర్తతో కలిసి ఆస్ట్రియాలోనే సెటిలైన సెలీనా చివరిసారిగా 2012లో విల్ యూ మ్యారీ మీ అనే సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించారు. దాదాపు 15 ఏళ్లుగా సినీరంగానికి, భారతదేశానికి దూరంగానే ఉంటున్నారు.
ఈ క్రమంలో గతేడాది నవంబర్లో భర్త పీటర్ హాగ్పై ముంబైలోని ఓ జ్యుడీషియల్ కోర్టులో సెలీనా గృహ హింస కేసు పెట్టడంతో బాలీవుడ్ షాకైంది. గృహ హింస, క్రూరత్వం, మోసం ఆరోపణలపై ఆమె ఈ కేసు పెట్టారు. ఆస్ట్రియాలో ఉన్న తన బిడ్డల్ని కలిసేందుకు కూడా భర్త అనుమతించడం లేదని సెలీనా ఫిర్యాదు చేశారు. పీటర్ నుంచి నెలకు 10 లక్షల రూపాయల భరణంతో పాటు 50 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని సెలీనా కోర్టుకు విన్నవించుకున్నారు. నాటి నుంచి భారత్లోనే ఉన్న సెలీనా.. తన పరిచయాలతో సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రాజ్కమల్ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న సిస్టర్ నివేదిత బయోపిక్లో సెలీనా ఛాన్స్ కొట్టేశారు.
ఈ నేపథ్యంలో ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెలీనా మాట్లాడుతూ.. తన వైవాహిక జీవితంపై ఎమోషనల్ అయ్యారు. ఆస్ట్రియాలో నా 15వ పెళ్లిరోజు గిఫ్ట్గా నా భర్త విడాకుల నోటీసులు పంపాడు. బాధతో నోటీసును కూడా చదవలేకపోయా, విడాకుల కేసు విచారణ సమయంలోనూ భర్త నుంచి వేధింపులు ఎదుర్కొన్నా. అప్పటికే చేతిలో డబ్బు అయిపోతుండటంతో ఆర్ధిక సమస్యలు అనుభవించా. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విడిపోవడానికే నిర్ణయం తీసుకున్నా. దాంతో నా ఆస్తులు, నా పెట్టుబడులు, పిల్లల బాధ్యత గురించి నా భర్తకు లాయర్ ద్వారా ప్రపోజల్ పెట్టా. ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ పై అంతస్తులో నా భర్త, కింద పిల్లలతో నేను జీవించామని సెలీనా కంటతడి పెట్టారు.
పిల్లలను పోషించుకోవడం, రోజువారీ అవసరాల కోసం ఏదైనా ఉద్యోగం చేయాలని అనుకున్నా. దాంతో నా భర్త తనను సూపర్ మార్కెట్లో క్లీనర్గా పెట్టిస్తానని హేళనగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే భారత్లోని నా ఆస్తులను విక్రయిస్తున్నాడని తెలిసి అర్ధరాత్రి అప్పటికప్పుడే ముంబైకి వచ్చేశా. నగరంలో తలదాచుకోవడానికి ఇల్లు లేకపోవడంతో హోటల్లోనే ఉన్నా, ఈ సమయంలో స్నేహితులు అండగా నిలిచారని సెలీనా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. దాంతో సిస్టర్ నివేదితతో సెలీనా కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications



