12 ఏళ్లుగా డేటింగ్.. పెళ్లికాకపోయినా.. యువ హీరోయిన్
పెళ్లి, వైవాహిక జీవితంపై భారతీయ యువతలో ఇటీవల బలమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 40 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తడం లేదు. కెరీర్లో స్థిరపడకపోవడం, కుటుంబ బాధ్యతలపై భయం తదితర కారణాలతో పెళ్లిని వాయిదా వేస్తున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలది కూడా అదే పరిస్ధితి. భారతీయ సినీ రంగంలో ఎంతో మంది స్టార్స్ బ్యాచిలర్స్గా ఉన్న వాళ్లే. సల్మాన్ ఖాన్, సుస్మిత సేన్, ప్రభాస్, అనుష్క, త్రిష సహా ఈ లిస్ట్లో ఎంతోమంది ఉన్నారు. కొందరు సోలో లైఫే సో బెటర్ అంటూ హాయిగా గడిపేస్తున్నారు.
పెళ్లికి దూరంగా స్టార్స్
పెళ్లిపై తమకు సదభిప్రాయం లేదని, కానీ పిల్లలు కావాలని ఫిక్స్ అయినవారెందరో. మరికొందరైతే దత్తత తీసుకుని పిల్లల్ని పెంచుతున్నారు. మరికొందరు ఎఫైర్లు, బ్రేకప్స్తో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకే వస్తారు బాలీవుడ్ ముద్దుగుమ్మ డయానా పెంటీ. ముంబైకి చెందిన డయానా అక్కడే చదువుకుని మోడలింగ్లో దిగారు. ఎలైట్ మోడల్స్ ఇండియాకు ఫోటోలు పంపడంతో ఆమె ఫోటోలు నిర్వాహకులకు ఎంతో నచ్చాయి. దీంతో ఎలైట్ మోడల్స్ ఇండియాలో మోడల్గా పనిచేసేందుకు డయానాకు అవకాశం దక్కింది. పారాచుట్, వెస్ట్సైడ్ వంటి టాప్ బ్రాండ్స్కు ఆమె ప్రచార కర్తగా వ్యవహఱించారు.

మోడల్ టూ హీరోయిన్గా డయానా
మోడల్గా దూసుకెళ్తున్న దశలో 2011లో ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన రాక్స్టార్ చిత్రం ద్వారా డయానా బాలీవుడ్లో అడుగుపెట్టారు. తర్వాత కాక్టెయిల్, లక్నో సెంట్రల్, ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్, సెల్ఫీ, బ్లడీ డాడీ, అద్భుత్, ఆజాద్లలో నటించారు. ఇక ఏడాది మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చావాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కుమార్తె జినత్గా నటించి మెప్పించింది డయానా.
అమితాబ్తో మరిచిపోలేని జ్ఞాపకం
ప్రస్తుతం సెక్షన్ 84లో నటిస్తున్నారు డయానా. బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రిభు దాస్గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే సెక్షన్ 84 షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు డయానా అభిమానులతో పంచుకున్నారు. అమితాబ్తో కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉందని, అలాంటి గొప్ప వ్యక్తిని చూస్తూ నటించడం నా జీవితంలో గొప్ప అనుభూతి అని డయానా తెలిపారు. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ సెక్షన్ 84 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
12 ఏళ్లుగా అతనితో కలిసే
అందరు హీరోయిన్ల మాదిరిగానే డయానా పెంటీ కూడా ప్రేమలో పడ్డారు. వజ్రాల వ్యాపారి హర్ష్ సాగర్తో దాదాపు 12 ఏళ్లుగా డేటింగ్లో ఉన్నట్లు డయానా బాంబు పేల్చారు. సుదీర్ఘకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నప్పటికీ వివాహ బంధంలోకి మారేందుకు తొందరపడటం లేదని ఆమె వెల్లడించారు. దాదాపు 22 ఏళ్లుగా మా ఇద్దరికీ పరిచయం ఉందని.. ఇది నా జీవితంలో సగం.. కాబట్టి హర్ష్ను పెళ్లి చేసుకోకపోయినా, మైండ్లో చేసుకున్నట్లుగానే భావిస్తున్నట్లు డయానా చెప్పారు. మా రెండు కుటుంబాలు కూడా మా ప్రేమ బంధానికి మద్ధతుగా నిలిచాయని.. పెళ్లి చేసుకోమని మా ఇద్దరిపై పెద్దలు ఎలాంటి ఒత్తిడి తీసుకురావడం లేదని డయానా వెల్లడించారు. మేం కలిసే ఉన్నామని అందరికీ తెలుసునని, కాబట్టి తొందరపడటం లేదని.. ఇది దాదాపు వివాహం లాంటిదే అన్నారు. కాకపోతే ఇది కాగితాలపై లేదు, అంతకుమించి ఎలాంటి తేడా లేదని డయానా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











