Divya Bharti Death Mystery: దివ్యభారతి మరణం ప్రమాదమా? హత్యా?... 33 ఏళ్లుగా మిస్టరీగానే..
మన చుట్టూ ఉన్న మనుషుల్లో కొన్ని అనుమానాస్పద మరణాలు జరుగుతుంటాయి. సామాన్యులే కాదు కొందరి మరణాలు కూడా అంతు చిక్కని విధంగా ఉంటాయి. ఏళ్లు గడుస్తున్నప్పటికీ వారి మరణానికి దారి తీసిన పరిస్ధితులు.. వారిది హత్యా? ఆత్మహత్యా? అన్నది తెలియక ఎప్పటికీ అనుమానాస్పద మృతిగానే మిగిలిపోతున్నాయి. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మిస్టరీలెన్నో. ఈ కోవలోకే వస్తుంది అందాల నటి దివ్య భారతి మరణం. ఆమె ఈ లోకాన్ని వీడి దాదాపు 33 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ దివ్యభారతి మరణం వెనుక దాగున్న మిస్టరీ ఏంటీ? అనేది మాత్రం తెలియరావడం లేదు. కానీ మీడియా, సోషల్ మీడియా, ప్రజలు మాత్రం రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలు పరిశీలిస్తే..
25 ఫిబ్రవరి 1974న ముంబైలో జన్మించారు దివ్యభారతి. తల్లిదండ్రులు ఓమ్ ప్రకాష్ భారతి, మీటా భారతి. ఆమెకు ఓ తమ్ముడు కునాల్ కూడా ఉన్నారు. ముంబైలోని మెకంజీ కూపర్ హై స్కూల్లో చదువుకున్న దివ్య భారతికి కనీసం స్కూల్ డేస్ గడవకముందే సినిమాలలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె 9వ తరగతిలో ఉండగా నందూ తొలాని అనే హిందీ సినీ ప్రముఖు ఆమెకు ఆఫర్ ఇచ్చారు. అయితే 1990లో తమిళ చిత్రం నిలా పెన్నాయ్ ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు దివ్యభారతి. ఇక తెలుగులో బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, చిట్టెమ్మ మొగుడు వంటి వరుస బ్లాక్బస్టర్లతో ఇండస్ట్రీని షేక్ చేశారు.

ఇక హిందీలో విశ్వాత్మ, షోలా ఔర్ షబ్నామ్, దీవానా, క్షత్రియ, దిల్ హై హో హై, దుష్మాన్ జమీనా, గీత్, దిల్ ఆష్నా హై తదితర చిత్రాలతో అలరించారు. తెలుగు, హిందీ భాషల్లో అగ్రనటిగా దూసుకెళ్తున్నారు. టీనేజ్లో ఉన్న ఆకర్షణల కారణంగా బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో ప్రేమాయణం సాగించారు దివ్యభారతి. బాలీవుడ్ సూపర్స్టార్ గోవిందాతో కలిసి ఓ సినిమా చేస్తుండగా నిర్మాత సాజిద్ ఆ సెట్స్కి వచ్చేవారు. అక్కడే వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. అయితే అప్పటికి దివ్యభారతి వయసు 17 ఏళ్లు మాత్రమే.
ఆమె మేజర్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒకరోజు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా, వారి అనుమతి లేకుండా మే 10, 1992న రహస్యంగా వీరిద్దరికీ పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత దీపావళి సందర్భంగా దివ్యభారతి తండ్రికి తమ పెళ్లి గురించి చెప్పారు సాజిద్. అయితే దీనిపై తనకు కొంత సమయం కావాలని, ఆ తర్వాత తానే అధికారికంగా మీ పెళ్లి గురించి ప్రకటిస్తానని చెప్పారు ఆమె తండ్రి. పెళ్లి కోసం దివ్య భారతి హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించి .. తన పేరు సనా నడియాద్వాలాగా మార్చుకుందని బాలీవుడ్ వర్గాలు చెబుతుంటాయి.
తన అందం, నటనతో టాలీవుడ్, బాలీవుడ్లలో తిరుగులేని నటిగా, కుర్రాళ్ల కలల రాకుమారిగా వెలుగొందుతున్నారు దివ్యభారతి. ఆమెతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. 1992లో ఏకంగా 12 సినిమాలలో నటించిన దివ్యభారతి.. కేవలం మూడేళ్ల కాలంలోనే 21 చిత్రాలలో నటించిందంటే ఆ రోజుల్లో ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కెరీర్ సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న దశలో ఎవ్వరూ ఊహించని విధంగా దివ్యభారతిని విధి చిన్నచూపు చూసింది.
1993 ఏప్రిల్ 5న ముంబైలోని తన అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి పడి తీవ్రగాయాలతో దివ్యభారతి కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. కోట్లాదిమంది అభిమానులు ఆమె మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించే నాటికి దివ్యభారతి వయసు కేవలం 19 ఏళ్లే కావడం దురదృష్టకరం. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉండి, భారతీయ సినీరంగాన్ని ఏలుతున్న సమయంలో చిన్న వయసులోనే ఆమె తిరిగిరాని లోకాలకు తరలిపోవడం అందరినీ కలిచివేసింది.
ఇదంతా ఒక ఎత్తయితే దివ్యభారతి మరణం చుట్టూ అనేక అనుమానాలు, పుకార్లు చక్కర్లు కొట్టాయి. దివ్యభారతి ప్రమాదవశాత్తూ చనిపోలేదని ఆత్మహత్య చేసుకుందని కొందరు.. భర్త సాజిద్ ఆమెను బాల్కనీలో నుంచి తోసి చంపేశాడని మరికొందరు ప్రచారం చేశారు. కానీ నేటికీ ఆమె మరణం వెనుక ఉన్న కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. పోలీస్ శాఖ సైతం దీనిని ప్రమాదంగానే భావించి కేసును క్లోజ్ చేశారు.
అయితే దివ్య భారతి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారని ఆమె సన్నిహితుల్లో కొందరు చెబుతుంటారు. మరణానికి కొద్దిగంటల ముందు చెన్నై నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని ముంబైలోని నివాసానికి చేరుకున్న దివ్యభారతి.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్తో కలిసి ఓ సినిమా కోసం కావాల్సిన కాస్ట్యూమ్స్, ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో బాల్కనీలోని గోడపై కూర్చొని ఉన్న దివ్య భారతి ప్రమాదవశాత్తూ కిందపడిపోయారని కొందరు చెబుతున్నారు.
మరికొందరు మాత్రం దివ్యభారతి ఆ సమయంలో మద్యం సేవిస్తుండగా.. మత్తులో బ్యాలెన్స్ కోల్పోయారని, బాల్కనీ మీద నుంచి పడబోతుండగా తనను తాను రక్షించుకునేందుకు ఎంతో ప్రయత్నించారని కానీ అవన్నీ విఫలమై దివ్యభారతి కిందపడిపోయారని వాదిస్తున్నారు. ఇదే సమయంలో దివ్యభారతి తండ్రి ఓం ప్రకాష్ భారతి మాత్రం.. తన కుమార్తె మరణం చుట్టూ ఉన్న వివాదాలపై అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. తన బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని, హత్య కూడా కాదని బాల్కనీ గోడపై కూర్చొని ఉండగా జరిపోపోయిందన్నారు. అలాగే ఆమె అతిగా మద్యం కూడా సేవించలేదని ఓంప్రకాష్ తెలిపారు.
అలాగే చనిపోవడానికి ముందు కమల్ సదానా అనే బాలీవుడ్ నటుడితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. అతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివ్యభారతి మరణవార్తను నేను అస్సలు జీర్ణించుకోలేకపోయాను. ఆమె అద్భుతమైన వ్యక్తి, ప్రతిభావంతురాలు. చనిపోయే నాటికి దివ్యభారతి చేతిలో చాలా సినిమాలున్నాయి. అవి చేసుంటే ఆమె మరింత పెద్ద హీరోయిన్ అయ్యేది. అలాగే దివ్యభారతికి వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవు.. ఆమె మరణం ప్రమాదం మాత్రమే అనుకుంటున్నానని కమల్ సదానా అభిప్రాయపడ్డారు. అయితే ఎవరు ఎన్ని వివరణలు ఇచ్చినా దివ్యభారతి మరణం మాత్రం ఇప్పటికీ మిస్టరీయే. ఏది ఏమైనా వెండితెరపై ధ్రువతారగా వెలుగొందాల్సిన దివ్యభారతి 19 ఏళ్లకే తనువు చాలించడం భారతీయ చిత్ర పరిశ్రమను ఇప్పటికీ బాధిస్తూనే ఉంది.


Click it and Unblock the Notifications







