దివ్య భారతి మరణం గురించి ముందే హెచ్చరిక.. జ్యోతిష్కుడు ఏం చెప్పారంటే?
Divya Bharti: దివ్య భారతి... భారతీయ సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నటి. కేవలం మూడు సంవత్సరాల సినీ ప్రయాణంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి, కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్నది. ఆమె జీవితం ఎంత వేగంగా విజయాల బాటలో పయనించిందో, అంతే అనూహ్యంగా ముగిసిపోయింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 1993 ఏప్రిల్ 5న అనుహ్యంగా మరణించింది.
అయితే.. దివ్య భారతి మరణించి మూడు దశాబ్దాలు గడిచినా ఆమె చుట్టూ ఉన్న మిస్టరీలు, కథనాలు, పుకార్లు ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కథనంతో మరోసారి ఆమె పేరును వార్తల్లోకి తీసుకొచ్చింది. చిన్నతనంలోనే ఓ జ్యోతిష్యుడు ఆమె జీవితంపై సంచలన హెచ్చరిక చేశాడని, ఆ మాటలు తర్వాత నిజమయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఏమన్నారు? ఆమె తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు?

దివ్య భారతి సినీ ప్రయాణం గురించి చెప్పాలంటే.. 1974 ఫిబ్రవరి 25న ముంబైలో జన్మించిన ఆమె చాలా చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలుత దక్షిణాది చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్లో కూడా సెన్సేషన్గా మారింది. తెలుగులో బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, చిట్టెమ్మ మొగుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి, ప్రేక్షకులను మెప్పించింది. అదే సమయంలో హిందీలోనూ వరుస విజయాలు సాధించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
1992 సంవత్సరంలోనే దివ్య భారతి దాదాపు డజనుకు పైగా చిత్రాల్లో నటించడం ఆమె క్రేజ్కు నిదర్శనం. ఆమె మరణించే సమయంలో ఆమె చేతిలో మరో 25 నుంచి 30 చిత్రాల వరకు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతాయి. నిర్మాతలు, దర్శకులు ఆమె డేట్స్ కోసం పోటీ పడేవారు. అంతటి డిమాండ్ ఉన్న హీరోయిన్గా ఎదిగిన సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాద్వాలా(Sajid Nadiadwala)తో ప్రేమలో పడిన దివ్య భారతి, కుటుంబ సభ్యులకు తెలియకుండా 1992లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆమె హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించి తన పేరును 'సనా నడియాద్వాలా'గా మార్చుకున్నట్లు కూడా పలు బాలీవుడ్ కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ అంశాలపై కూడా కాలక్రమేణా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలోనే 1993 ఏప్రిల్ 5న ముంబైలోని తన అపార్ట్మెంట్ ఐదో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడటంతో దివ్య భారతి తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. కోట్లాది మంది అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె మరణం ప్రమాదమా? ఆత్మహత్యా? లేక మరేదైనా కారణమా? అనే అనుమానాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.
కొంతమంది ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని భావించగా, మరికొందరు హత్య అని ప్రచారం చేశారు. భర్త పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దర్యాప్తు అనంతరం పోలీసులు దీనిని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగానే పరిగణించి కేసును ముగించారు. అయినప్పటికీ ఆమె మరణం వెనుక అసలు నిజం ఏమిటన్న ప్రశ్నకు ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదని అభిమానులు భావిస్తుంటారు.
దివ్య భారతి మరణం తర్వాత ఓ జ్యోతిష్య కథనం బాగా వైరల్ అయింది. ఈ కథనాల ప్రకారం.. దివ్య భారతి ఎనిమిదేళ్ల వయసులో ఆమె జాతకాన్ని ఓ జ్యోతిష్యుడు పరిశీలించాడట. ఆ సమయంలో అతడు ఆమె తల్లికి ఆందోళనకర విషయాలు చెప్పాడట."మీ కుమార్తె జాతకంలో మరణగండం ఉంది. ఈమె అల్పాయుష్షురాలు. 17 లేదా 18 ఏళ్ల తర్వాత ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇప్పటి నుంచే ప్రత్యేక పూజలు, శాంతి కార్యక్రమాలు నిర్వహించండి" అని సూచించాడని ప్రచారం సాగుతోంది. ఈ హెచ్చరికతో కొంతకాలం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసినప్పటికీ, తర్వాత వాటిని నిలిపివేశారని చెబుతారు.
అయితే ఈ కథనానికి సంబంధించి ఎటువంటి అధికారిక ఆధారాలు, కుటుంబ సభ్యుల ధృవీకరణలు లేదా రికార్డులు అందుబాటులో లేవు. దివ్య భారతి మరణానంతరం వెలుగులోకి వచ్చిన ఈ కథనాలు నిజమా? లేక రూమర్? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇప్పటికీ లేదు. అయినప్పటికీ ఈ కథనం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతోంది. ఏది ఏమైనా, దివ్య భారతి జీవితం భారతీయ సినీ చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. తక్కువ కాలంలోనే అద్భుత విజయాలు సాధించి, అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచిపోయిన ఆమె మాత్రం ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో సజీవంగానే ఉంది.


Click it and Unblock the Notifications






