మగాళ్ల మూడ్ అలాంటిదే... కుక్కలతో పోలుస్తూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దేశంలో వీధి కుక్కల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట వీధి కుక్కులు జనంపై విరుచుకుపడుతుండటంతో వాటి నివారణపై భారీగా చర్చ జరుగుతోంది. విషయం ఏకంగా సుప్రీంకోర్ట్ వరకు వెళ్లింది. కుక్కుల నిర్మూలనపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో వారిపై పలువురు మండిపడుతున్నారు. తాజాగా వీధి కుక్కల అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన అలియాస్ రమ్య చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే...
దేశంలో కుక్కకాటు ఘటనలు పెరిగిపోతుండటం, పలుచోట్ల ప్రాణాలు కూడా పోతుండటంతో గతంలోనే సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు, బస్టాండ్స్, రైల్వేస్టేషన్లు తదితర జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీధి కుక్కలు సంచరించకుండా ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. కుక్కలు చొరబడకుండా కంచెలు నిర్మించాలని సూచించింది. నాడు ఈ అంశంపై వివాదం రేగగా.. తాజాగా మరోసారి వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్ట్లో విచారణ జరిగింది. వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించాలని తాము ఆదేశించలేదని సుప్రీం పేర్కొంది.

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుక్కల బెడద పెరిగిపోతుండటంతో ఇన్ని బాధలు ఉన్నప్పుడు వాటి స్థానంలో పిల్లుల్ని పెంచుకోవచ్చు కదా అని పేర్కొంది. వీధి కుక్కులకు ఆహారం పెట్టేవాళ్లు, వాటి వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటున్న సామాన్యుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటుండటంతో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.
వీధి కుక్కలపై ప్రేమ ఉండొచ్చు... కానీ వాటి వల్ల మనుషులకు ప్రమాదం ఉండకూడదని ధర్మాసనం పేర్కొంది. కుక్కల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.. అవి ఎప్పుడు దాడి చేస్తాయో ఊహించలేమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే వీధి కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని కోర్ట్ పేర్కొంది. సుప్రీంకోర్ట్ వ్యాఖ్యలపై నటి దివ్య స్పందన తనదైనశైలిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మగాళ్ల మూడ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మగాళ్ల మైండ్ సెట్ను కూడా చదవలేం.. వాళ్లు ఎప్పుడు లైంగిక దాడికి పాల్పడతారో, ఎప్పుడు హత్యలు చేస్తారో కూడా ఊహించలేం. అందుచేత మగాళ్లందరినీ జైళ్లో పెట్టాలా? అని ఇన్స్టాలో ఆమె పోస్ట్ పెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. మగాళ్లను కుక్కలతో పోలుస్తావా? తక్షణం క్షమాపణలు చెప్పాలంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సంచలనం సృష్టించడంతో దివ్య స్పందన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
కాగా... కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు దివ్య స్పందన. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అభి, ఆకాష్, అమృతధారే, సంజు వెడ్స్ గీత వంటి కన్నడ చిత్రాలతో శాండిల్వుడ్లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అలాగే తమిళంలో సూర్యతో వారణం ఆయిరం, ధనుష్ సరసన పొల్లాదవన్ సినిమాలలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అభిమన్యు సినిమాలో నటించి తెలుగువారిని పలకరించింది.
హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించింది రమ్య. కాంగ్రెస్ అభ్యర్ధిగా 2013 మాండ్య లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తాచాటింది. అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో రమ్య ఓడిపోయారు. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల్ని అప్పగించారు రాహుల్. సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె పలు అంశాలపై స్పందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దర్శన్ అరెస్ట్పై స్పందించడంతో అతని అభిమానుల నుంచి నిరసన సెగ ఎదురైంది. ఇప్పుడు తాజాగా వీధి కుక్కల అంశానికి మగాళ్లతో ముడిపడి దివ్య స్పందన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


Click it and Unblock the Notifications











