వాళ్లది శవ రాజకీయం.. సొంత పార్టీపైనే దుమ్మెత్తి పోసిన నటి దివ్యవాణి
సినీ రంగానికి, రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. సినీరంగంలో మెరిసిన చాలా మంది రాజకీయాల్లో కూడా తమ లక్ పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారిలో దివ్యవాణి ఒకరు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె అతి తక్కువ కాలంలోనే ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసి దాన్ని డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు శవ రాజకీయాలు చేస్తారంటూ తెలుగుదేశం మీద కామెంట్ చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే

చాలా సేపు ఏడ్చా
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి హోదా అనుభవిస్తున్న దివ్యవాణి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అలా చేయడాని కంటే ముందు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ అంతర్గత వ్యవహారాల మీద సంచలన ఆరోపణలు చేశారు.
ఆ పార్టీ కోసం ఎంత పని చేసినా తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసిన దివ్యవాణి మహానాడు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చాలా సేపు ఏడ్చానని, చెప్పారు. తాను ఏడుస్తుంటే పిల్లలు చూసి తిట్టారని అర్ధరాత్రివేళ అంత రిస్క్ తీసుకుని కారులో మహానాడుకు ఎందుకు వెళ్లావని ప్రశ్నించారు అని ఆమె పేర్కొన్నారు.

శవాన్ని పెట్టుకొని ఓట్లు
మహానాడుకు వెళ్లేందుకు అర్ధరాత్రి కారులో ఒంటరిగా ప్రయాణం చేశానని, ఆ సమయంలో ఆరోగ్యం కూడా సరిగా లేదు కానీ పార్టీ మీద ఉన్న ఇష్టంతో రిస్క్ చేసి వెళ్లానని ఆమె పేర్కొన్నారు. దారిలో నాకేదైనా అయితే నా శవాన్ని పెట్టుకొని ఓట్లు అడుగుతారేమో అంతకుమించి ఏం చేయలేరు అంత కష్టపడి వెళితే మహానాడులో నాకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు అని ఆమె ఎమోషనల్ అయ్యారు. నాకు మాట్లాడటం చేతకాదా లేక మాటలు రావా అంటూ ఆమె ప్రశ్నించారు.

గుర్తింపు కూడా లేక
దాదాపు మూడేళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే కనీసం గుర్తింపు కూడా లేకపోయింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కళాకారుడైన దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీలో కళాకారులకు కనీసం స్థానం లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. ఒక్క మురళీమోహన్ తెలుగు దేశంలో మరే కళాకారులకు స్థానం లేదని అసలు కళాకారులు టిడిపిలో ఎందుకు ఇమడలేకపోతున్నారు అనే విషయం ఇప్పుడే తనకు అర్థం అవుతుంది అంటూ ఆమె పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వైరల్
ఆ తర్వాత మంగళవారం నాడు ఆమె తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే సదరు ట్వీట్ ను ఆమె ట్విట్టర్ నుంచి డిలీట్ చేశారు. అయితే మీడియా ఆమెను ఏమైంది అని ప్రశ్నిస్తే తాను ఒక చిన్న విషయంలో పొరపాటు పడడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించా అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు ఒక లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె పేర్కొన్నారు.

తెలుగుదేశం లోనే కొనసాగుతున్నా
అది నిజమే అని నమ్మి తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించానని, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత అదేమీ లేదని తెలిసింది అని ఆమె పేర్కొన్నారు. ఈ విషయం మీద చంద్రబాబు లోకేష్ లతో తాను మాట్లాడి తేల్చుకుంటానని ప్రస్తుతానికి తన తెలుగుదేశం లోనే కొనసాగుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











