పెళ్లైన వ్యక్తితో రిలేషన్.. ఆ రెండేళ్లు నరకం అనుభవించా
దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన నటి హన్సిక మోత్వానీ తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా మాట్లాడని హన్సిక.. ఈసారి మాత్రం తన వివాహ జీవితం, విడాకులు, మానసిక ఆరోగ్యం, కుటుంబ మద్దతు వంటి అంశాలపై మనసు విప్పి మాట్లాడింది. ముఖ్యంగా రెండేళ్లు తాను ఎదుర్కొన్న మానసిక వేదన గురించి చెప్పిన విషయాలు అభిమానులను కలచివేస్తున్నాయి.
హన్సిక మాటల్లో కనిపించిన బాధ, ఆవేదన చూస్తుంటే ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎంతగా ప్రభావం చూపాయో అర్థమవుతోంది. ఒక ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ.. జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు సరైనవి కాకపోవచ్చని, అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు సాగడం చాలా ముఖ్యమని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన "రాంగ్ ట్రైన్ ఎక్కితే తదుపరి స్టేషన్లో దిగిపోవాలే' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. "తప్పు ట్రైన్ ఎక్కిన తర్వాత అది చివరి గమ్యస్థానానికి చేరేవరకు కూర్చోవాల్సిన అవసరం లేదు. మనకు అది సరైన మార్గం కాదని తెలిసిన క్షణంలో బయటకు రావాలి. అదే జీవితంలో కూడా వర్తిస్తుంది" అని హన్సిక చెప్పింది.

అయితే హన్సిక తన వివాహం లేదా విడాకుల గురించి నేరుగా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కానీ ఆ కాలంలో తాను మానసికంగా ఎంత కుంగిపోయానో మాత్రం వివరించింది. "గత రెండేళ్లు నా జీవితంలో అత్యంత కఠినమైన కాలం. ఎప్పుడూ నవ్వుతూ ఉండే నేను పూర్తిగా మారిపోయాను. బయటకు కనిపించకపోయినా లోపల చాలా బాధ అనుభవించాను. సాధారణంగా నేను చాలా ఉల్లాసంగా ఉండే వ్యక్తిని. అలాంటి నేను ఒక్కసారిగా మౌనంగా మారడం చూసి మా అమ్మ, నా అన్నయ్య చాలా ఆందోళన చెందారు" అని తెలిపింది. తన పరిస్థితి మరింత దిగజారకుండా కుటుంబ సభ్యులు ఎంతో అండగా నిలిచారని ఆమె చెప్పింది. ముఖ్యంగా తన తల్లి, సోదరుడు తనకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించారని వెల్లడించింది.
"నువ్వు కంఫర్టబుల్గా లేని పరిస్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు" అని వాళ్లు తనకు మద్దతు ఇచ్చారని గుర్తుచేసుకుంది. అంతేకాదు, తన స్నేహితురాలు ఒకరు తన పరిస్థితిని గమనించి ప్రొఫెషనల్ సహాయం తీసుకోవాలని సూచించిందని, ఆమె సూచనతోనే తాను థెరపీ తీసుకున్నానని వెల్లడించింది. "థెరపీ నా జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది. మనసులోని బాధలను బయటకు చెప్పడం ఎంత ముఖ్యమో అప్పుడే అర్థమైంది" అని చెప్పింది.
ఇక మీడియా, సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన వార్తలపై కూడా హన్సిక స్పందించింది. విడాకుల తర్వాత తనపై అనేక రకాల కథనాలు వచ్చాయని, చాలామంది నిజం తెలుసుకోకుండా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారని పేర్కొంది. అయితే వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు ఎప్పుడూ అనిపించలేదని స్పష్టం చేసింది. "ప్రజలకు కావాల్సింది హెడ్లైన్స్. క్లిక్బైట్స్. వాటి కోసం చాలా కథలు సృష్టించారు. కానీ నేను ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. ఇక ముందు కూడా ఇవ్వను. ఎందుకంటే నా జీవితాన్ని నేను బాగా తెలుసు. ఇతరులు ఏమనుకుంటున్నారన్నది నాకు అంత ముఖ్యమైన విషయం కాదు" అని ఆమె ధైర్యంగా చెప్పింది.
అయితే తన జీవితంలో జరిగిన వాటిపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానని హన్సిక వెల్లడించింది. "ఇప్పుడు నాకు ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా కోసం జీవిస్తున్నాను. ఒంటరిగా ప్రయాణాలు చేయడం, ఆధ్యాత్మిక యాత్రలు చేయడం, కుటుంబంతో సమయం గడపడం నాకు ఎంతో ప్రశాంతత ఇస్తున్నాయి" అని తెలిపింది. ప్రేమపై తన నమ్మకం ఇంకా అలాగే ఉందని కూడా హన్సిక చెప్పింది. "ప్రేమ చాలా అందమైన భావన. జీవితంలో ప్రేమకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలియదు. కానీ ప్రస్తుతం నేను నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను" అని పేర్కొంది. ప్రస్తుతం మరోసారి ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications




