కోరిక తీర్చలేదని సినిమా నుంచి తీసేశారు.. ఎన్టీఆర్ హీరోయిన్కు చేదు అనుభవం
కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే గాక అత్యంత పాశవికంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య ప్రపంచం రోడ్డెక్కింది. సమాజంలో ఏ కామాంధుడు ఎటు వైపు నుంచి వచ్చి కాటేస్తాడో తెలియక మహిళలు బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చిన్నారుల నుంచి రేపో మాపో పోయే వృద్ధురాళ్ల వరకు ఈ కీచకులు వదిలిపెట్టడం లేదు. సినీరంగంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతాయని అంతా అంటూ ఉంటారు. జూనియర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారు సైతం ఇలాంటి వారి చేతిలో బాధితులు కావడం దురదృష్టకరం.
ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే ఆడపిల్లలు కమిట్మెంట్కు సిద్ధం కావాల్సిందేనని ఎంతోమంది నటీమణులు ఆరోపణలు చేశారు. ఇక మీ టూ ఉద్యమం సాగినంత కాలం.. రోజుకొక ప్రముఖుడి గురించి ఆరోపణలు వినిపించేవి. పెద్దవాళ్లు చెప్పినట్లు చేయకుంటే తొక్కేస్తారని, వారిని సంతృప్తిపరచాల్సిందేనని ఆరోపించారు. క్యాస్టింగ్ కౌచ్ కారణంగా సినీరంగంలో వెలిగిపోవాలని వచ్చిన ఎంతోమంది అమ్మాయిలు బలైపోయారు. ఈ నేపథ్యంలో మలయాళ చిత్ర పరిశ్రమపై హేమ కమిటీ రిపోర్ట్ మహిళల దుస్థితిని మరోసారి కళ్లకు కట్టింది.

సుదీర్ఘకాలం పాటు జస్టిస్ హేమ కమిటీ రీసెర్చ్ చేసింది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మహిళా నటులను కలిసి వారి నుంచి కీలక సమాచారం రాబట్టింది. మలయాళ ఇండస్ట్రీ ఓ మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని, ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మహిళలు తమపై జరిగే లైంగిక దాడులపై మాట్లాడటం లేదని.. వారిలో భయం, అభద్రతా భావం ఉందని.. కమిట్మెంట్కు ఓకే చెప్పే నటీమణులను ఒక కేటగిరీలుగా విభజించారని హేమ కమిటీ చెప్పింది. ఇలాంటి ఎన్నో భయానక విషయాలను ఈ కమిటీ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో మలయాళంతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. కెరీర్ ప్రారంభంలో తనను కూడా కొందరు ఇబ్బంది పెట్టారని మంచు లక్ష్మీ చెప్పారు. అయితే వేధింపులకు పాల్పడేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం నివేదికలు విడుదల చేస్తే ఉపయోగం లేదని తనూశ్రీ దత్తా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తెలుగమ్మాయి, సీనియర్ హీరోయిన్ సమీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

వరణం ఆయిరం (సూర్య సన్ ఆఫ్ కృష్ణన్) మూవీతో సమీరా రెడ్డి సౌత్లో బాగా ఫేమస్ అయ్యారు. ఓ సినిమా షూటింగ్ చేసే సమయంలో ఓ నటుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడని.. అతనికి తాను కోఆపరేట్ చేయలేదనే కోపంతో సినిమాలోంచి తీసేశాడని ఆమె తెలిపారు. తాను ఓ మూవీ చేస్తున్నానని, కానీ ఓ రోజున సడెన్గా లిప్ లాక్ ఉందని చెప్పారని, అయితే దీనికి తాను మానసికంగా సిద్ధంగా లేనని సమీరా రెడ్డి వెల్లడించారు. అయితే అంతకుముందు ముసాఫిర్లో లిప్లాక్ చేసినప్పుడు.. ఇప్పుడేమైందని అతను ప్రశ్నించాడని , ఇలా చేస్తే సినిమాలో ఉండవని జాగ్రత్తగా ఉండాలని ఆ వ్యక్తి నన్ను హెచ్చరించాడని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సమీరా రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇంతకీ ఆమెతో అలా ప్రవర్తించిన వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











