Upasana Konidela: రేణూ దేశాయ్కి ఉపాసన సాయం..అత్తగారి కోసం ఆగమేఘాలపై అంబులెన్స్
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనా కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అపోలో గ్రూప్ అధినేత ప్రతాప్ సీ రెడ్డి మనవరాలిగా, మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలిగా హుందాగా వ్యవహరిస్తున్నారు. ఆగర్భ శ్రీమంతురాలైన ఉపాసన నిరాడంబరంగా ఉండటానికే ఇష్టపడతారు. ఉన్నత వ్యక్తిత్వం, మంచి మనసు ఆమెను కోట్లాది మందికి చేరువ చేసింది. తాజాగా ఉపాసనపై ప్రశంసలు కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్. ఈ వివరాల్లోకి వెళితే..
వివాహమైన నాటి నుంచి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పుట్టింటికి, మెట్టింటికి మంచి పేరు తీసుకొచ్చారు ఉపాసన. భర్త సినిమాలు, షూటింగ్స్, వ్యాపారాలలో బిజీగా ఉండటంతో కుటుంబ బాధ్యతలు ఆమె తీసుకున్నారు. స్వతహాగా బిజినెస్ ఉమెన్ కావడంతో వ్యాపారాలు చూసుకుంటూనే కుటుంబాన్ని చక్కదిద్దుతున్నారు ఉపాసన. ఆమె తన జీవితంలోకి వచ్చాక తన లైఫ్ ఎంతో చేంజ్ అయ్యిందని పలు సందర్భాల్లో రామ్ చరణ్ భార్యను ప్రశంసల్లో ముంచెత్తారు.

వ్యాపారాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఉపాసన ముందుంటున్నారు. అపోలో ఫౌండేషన్ సీఎస్ఆర్ వైస్ ప్రెసిడెంట్గా ఆసుపత్రి నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటారు. అపోలో ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి వైద్య సహాయం అందిస్తున్నారు. బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 150కి పైగా వృద్ధాశ్రమాలకు అండగా నిలుస్తున్నారు. దీని కింద వృద్ధులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాలలో ఉన్న సుమారు 150కి పైగా వృద్ధాశ్రమాలకు మందులను సరఫరా చేస్తున్నారు. ఉపాసన సేవా కార్యక్రమాలపై పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆమెను వరించాయి. మూడేళ్ల క్రితం ప్రపంచ ప్రఖ్యాత దుబాయ్ గోల్డెన్ వీసాను ఉపాసన అందుకున్నారు. పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత గతేడాది చరణ్ - ఉపాసన తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పండంటి ఆడపిల్లకు ఉపాసన జన్మనిచ్చారు. ఆమెకు అమ్మవారి సహస్ర నామాల్లో ఒకటైన క్లీంకారా అని పేరు పెట్టుకున్నారు. ఈ చిన్నారి అడుగుపెట్టిన వేళా విశేషంతో మెగా ఫ్యామిలీలో అన్ని శుభకార్యాలు జరుగుతున్నాయి.
ఇదిలాఉండగా.. పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సేవలందిస్తున్నారు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్. తన స్తోమతకు తగిన విధంగా సాయం చేయడంతో పాటు , సమాజానికి అవగాహన కల్పిస్తుంటారు రేణు. సొంతంగా ఎన్జీవో స్థాపించాలని ఆమె ఏళ్లుగా కలలు గంటుండగా.. శనివారం సొంతంగా ఎన్జీవోను రిజిస్టర్ చేయించానని ఆమె స్పష్టం చేశారు. ఆర్ధిక సాయం చేయాలని అనుకునేవారు ముందుకు రావాలని రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

మూగ జీవాలను అమితంగా ఇష్టపడతారు రామ్ చరణ్, ఉపాసన. ఈ క్రమంలోనే రేణూ ఎన్జీవో గురించి తెలుసుకున్న ఉపాసన తన భర్త పెంపుడు శునకం రైమీ పేరిట విరాళం అందించారు. ఈ విషయాన్ని రేణు స్వయంగా ఇన్స్టాలో వెల్లడించారు. అంబులెన్స్ కొనుగోలుకు విరాళం అందించిన రైమీకి ధన్యవాదాలు అంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











