Rakul Preet Singh డ్రగ్స్ కేసులో నోటీసులు.. రకుల్ ప్రీత్ సింగ్కే ఎందుకంటే?.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో..!
దక్షిణాదితోపాటు బాలీవుడ్ సినీ రంగంలో రాణిస్తున్న అగ్రతార రకుల్ ప్రీత్ సింగ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) మరోసారి కొరడా ఝుళిపించింది. గత రెండు, మూడేళ్లుగా సాగుతున్న డ్రగ్స్ కేసు విచారణను మరోసారి తెరపైకి తీసుకు రావడం మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ గురించిన ఈడీ విచారణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మనీలాండరింగ్ కేసులో నోటీసులు
2017లో టాలీవుడ్కు డ్రగ్స్ సప్లైదారులకు సంబంధాల కోణంలో పలువురు సినీ తారలపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్)ను ఏర్పాటు చేశారు. 2017 సంవత్సరంలో ఆగస్టు 31 తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు సినీ ప్రముఖులను విచారించింది. మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకొన్న వారిలో పూరీ జగన్నాథ్, రానా దగ్గుబాటి, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్, నందు, తనీష్, నవదీప్ తదితరులు ఉన్నారు.

సుశాంత్ సింగ్ మరణం కేసుతో
ఇదిలా ఉండగా, సుశాంత్ సింగ్ మరణం కేసుతో సంబంధమున్న డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్కు ముంబై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. దాంతో ఆమె 2020 సెప్టెంబర్ 25వ తేదీన ఆమె ఎన్సీబీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో రకుల్ను సుదీర్ఘంగా విచారించడం తెలిసిందే. రకుల్తోపాటు దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్ తదితరులు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 19వ తేదీన విచారణకు రకుల్
అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ను విచారణకు పిలిచిన దాఖలాలు లేవు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ను డిసెంబర్ 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మనీలాండరింగ్ అంశం కింద రకుల్ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.

రకుల్ ఒక్కరికే నోటీసులు ఎందుకు?
అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో డిసెంబర్ 19వ తేదీన హైదరాబాద్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇతర సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేయకుండా కేవలం రకుల్ ప్రీత్ సింగ్కు మాత్రమే విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అనేది ప్రశ్నగా మారింది. ఈ నోటీసులపై సినీ ప్రముఖులు కూడా ఎవరూ నోరు విప్పడం లేదు. అయితే ఈ నోటీసులపై రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆసక్తిగా మారింది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కూడా
ఇదిలా ఉండగా, కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో 4 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణల నేపథ్యంలో రియల్టర్ సందీప్ రెడ్డి, హీరో తనీష్కు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం మరో సంచలన వార్తగా మారింది.


Click it and Unblock the Notifications











