పాక్ మిలటరీతో ఫౌజీ హీరోయిన్కు సంబంధాలు.. ఫౌజీ తార క్లారిటీ ఏమిటంటే?
జమ్మూకాశ్మీర్లోని ప్రకృతి అందాలకు నెలవైన పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి యావత్ దేశం నివ్వెరపోయింది. పర్యాటకులను చుట్టుముట్టి తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనతో దేశ ప్రజలు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, వారి వెనుక నుంచి నడిపిస్తోన్న పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ నటులు, పాక్ మూలాలున్న వారిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ బారినపడ్డ సినీనటి ఇమాన్వీ ఇస్మాయిల్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్, ఐఎస్ఐ, తీవ్రవాద సంస్థలపై భారతీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు దేశంలో ఉన్న పాకిస్తాన్ పర్యాటకులు తక్షణం భారత్ వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషనర్ను బహిష్కరించింది. మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి ప్రభావం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ఫౌజీ, ఈ సినిమా హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్పై పడింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో గతేడాది ఈ సినిమా ప్రారంభమైంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఫౌజీలో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఇమాన్వీ ఇస్మాయిల్ను ఎంపిక చేశారు. సినిమా ప్రారంభోత్సవం రోజున ప్రభాస్తో ఆమె ఫోటోలు వైరల్ కాగా.. ఇమాన్వీ గురించి జాతీయ స్థాయి మీడియాలో కథనాలు వచ్చాయి.
ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇమాన్వీపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె పాకిస్తాన్ మాజీ సైనికాధికారి కుమార్తె అని, పాక్ మూలాలున్న ఇమాన్వీ నటిస్తోన్న ఫౌజీ సినిమాని బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఫౌజీ సినిమా, ఇమాన్వీ కెరీర్పై నీలినీడలు కమ్ముకున్నాయి. తనపై జరుగుతున్న ట్రోలింగ్, తన జాతీయత, పాకిస్తాన్ మూలాలపై ఇమాన్వీ ఇస్మాయిల్ స్పందించారు. గురువారం సోషల్ మీడియాలో దీనిపై ఓ పోస్ట్ పెట్టారు.
తన గురించి, తన కుటుంబం గురించి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని.. నేను పాకిస్తాన్ జాతీయురాలిని కాదని ఇమాన్వీ తేల్చిచెప్పారు. తనకు, తన కుటుంబలోని ఎవరికీ పాకిస్తాన్తో సంబంధాలు లేవని.. పేరున్న మీడియా సంస్థలు కూడా తన విషయంలో పరిశోధన చేయకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఇమాన్వీ మండిపడ్డారు. తాను భారతీయ అమెరికన్ని , నా తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికా వలసవెళ్లి, ఆ దేశ పౌరులుగా మారారని లాస్ ఏంజెల్స్లో నేను పుట్టానని ఆమె స్పష్టం చేశారు.
తెలుగు, హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతానని.. భారతీయత, భారత సంస్కృతి నా రక్తంలోనే ఉందని ఇమాన్వీ పేర్కొన్నారు. చదువు తర్వాత కొరియోగ్రఫీ, డ్యాన్సింగ్, యాక్టింగ్ చేస్తూ ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో అవకాశాలను అందుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇమాన్వీ సంతాపం తెలిపారు. ఇమాన్వీ వివరణతోనైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి తెర పడుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











