నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఫేక్ ప్రచారంపై జాన్వీ కపూర్ ఫైర్
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ నటి శ్రీదేవి కూతురిగా సినీ రంగంలో అడుగుపెట్టిన ఆమె, తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తొలుత జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. అయితే.. తాజా తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ జాన్వీ కపూర్ ఫైర్ అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే, తన మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ జాన్వీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మద్యం అలవాటు (Alcohol Addiction)పై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, కొంతమంది మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆమె అసహనం వ్యక్తం చేసింది.

ఇటీవల మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే 'ఆఫ్ ది రాక్స్' (Off The Rocks) 'అమహా' (Amaha) సంస్థలు నిర్వహించిన పాడకాస్ట్లో జాన్వీ మాట్లాడారు. ఆ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒక బాధాకరమైన దశ గురించి ఓపెన్గా మాట్లాడింది. ఆ సమయంలో మానసికంగా చాలా కుంగిపోయి, కొంతకాలం మద్యం వైపు మళ్లిన విషయాన్ని ఆమె నిజాయితీగా చెప్పింది. అయితే, ఆ అనుభవాన్ని కొందరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని, ఆమెకు మద్యం వ్యసనం ఉందని ప్రచారం చేయడం ప్రారంభించారు.
ఈ తప్పుడు ప్రచారంపై వెంటనే స్పందించిన పాడ్కాస్ట్ నిర్వాహకులు స్పష్టత ఇచ్చారు. జాన్వీ కపూర్ మద్యం వ్యసనంతో బాధపడుతున్న వ్యక్తి కాదని, ఆమె ఈ కార్యక్రమంలో ఒక అవగాహన కార్యక్రమంలో భాగంగా, ఒక కేర్ గివర్గా పాల్గొన్నారని తెలిపారు. "కేవలం క్లిక్బైట్ కోసం ఇలాంటి వార్తలు సృష్టించడం సరైంది కాదు. ఇది నిజంగా వ్యసనంతో పోరాడుతున్న వ్యక్తులను అవమానించే చర్య" అని వారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
జాన్వీ కూడా అదే నోట్ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరమని స్పష్టం చేసింది. "నిజాన్ని పూర్తిగా తెలుసుకోకుండా, కాంటెక్స్ట్ లేకుండా వార్తలు వైరల్ చేయడం సరైంది కాదు" అని ఆమె పరోక్షంగా సూచించింది. అసలు పాడ్కాస్ట్లో జాన్వీ చెప్పిన మాటలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. 'నేను మద్యం వ్యసనానికి గురి కాలేదు. కానీ ఒక కష్టమైన సమయంలో కొంతకాలం తాగాను. ఆ సమయంలో నా మనసును మత్తులో ఉంచుకోవాలనిపించింది. కానీ త్వరగానే అది నాకు నష్టం చేస్తుందని గ్రహించి, దాని నుంచి బయటపడ్డాను' అని ఆమె వివరించింది. అంటే, ఇది ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే కానీ, వ్యసనం కాదని స్పష్టంగా చెప్పింది.
ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఎంత వేగంగా వ్యాపిస్తాయో చూపించింది. సెలబ్రిటీల మాటలను కాంటెక్స్ట్ లేకుండా ప్రచారం చేయడం ఎలా అపార్థాలకు దారితీస్తుందో ఈ ఉదంతం ఉదాహరణగా నిలిచింది. మొత్తానికి, జాన్వీ కపూర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, నిజం ఏంటో స్పష్టంగా చెప్పడంతో వివాదానికి తెరపడినట్టు అయింది.
ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' (Peddi) చిత్రంలో నటిస్తున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న పెద్ది సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'పెద్ది' జూన్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారబోతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications





