జాన్వీ కపూర్ పెళ్లి ఫిక్సా? తప్పిపోతే నా ప్రియుడికి అప్పగించండంటూ
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ, ప్రస్తుతం బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ వరుస సినిమాలతో బిజీగా మారారు. తాజాగా రామ్ చరణ్ పెద్దితో సక్సెస్ అందుకోగా.. అదే సమయంలో వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఆమె వార్తల్లో నిలువడానికి కారణమేంటీ?
జాన్వీ కపూర్.. శిఖర్ పహారియాతో రిలేషన్షిప్ గురించి గత కొంతకాలంగా వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ ప్రేమలో ఉందన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. వీరిద్దరూ కలిసి పలు కార్యక్రమాలకు హాజరుకావడం, దేవాలయ సందర్శనలు చేయడం, ఫ్యామిలీ ఈవెంట్లలో కనిపించారు. వీరిద్దరూ కలిసి పలు మార్లు మీడియా కంట కూడా పడ్డారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఇప్పటివరకు ఇద్దరూ తమ సంబంధంపై అధికారికంగా స్పందించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో ఈ జంటను మరోసారి హాట్ టాపిక్గా మార్చింది. ఆ ఫోటోలో జాన్వీ పింక్ కలర్ నైట్సూట్తో పాటు గ్రే కలర్ జాకెట్ ధరించి కనిపించింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె డ్రెస్పై ఉన్న ప్రత్యేక మెసెజ్. "If Lost, Please Return To Shikhar Pahariya" అని రాసి ఉంది. అంటే "నేను ఎక్కడైనా తప్పిపోతే దయచేసి నన్ను శిఖర్ పహారియాకు అప్పగించండి" అని దాని అర్థం.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని జాన్వీ తన ప్రేమను పరోక్షంగా వ్యక్తపరిచినట్లు భావిస్తుండగా, మరికొందరు ఇది క్యూట్ రిలేషన్షిప్ గోల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఇదే నిజమైన ప్రేమ", "పెళ్లి వార్తలకు ఇది హింట్ కావచ్చు", "శిఖర్పై జాన్వీ ప్రేమ ఎంతుందో ఈ ఒక్క మెసేజ్ చాలు" అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
అయితే జాన్వీ ఇలా శిఖర్పై ప్రేమను చూపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె మెడలో "Shikhu" అని రాసి ఉన్న నెక్లెస్ ధరించి పలుమార్లు కనిపించింది. అలాగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో కూడా శిఖర్ ఆమెకు అండగా నిలవడం, జాన్వీ నటించిన 'హోమ్బౌండ్' సినిమా ప్రీమియర్ సందర్భంగా ఆమెతో కలిసి కనిపించడం చర్చనీయాంశమయ్యాయి. అలా ఇద్దరూ కలిసి కనిపించే ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
దీంతో బాలీవుడ్లో వీరిద్దరి పెళ్లి గురించి కూడా తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో వచ్చిన పెళ్లి రూమర్లను జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు కెరీర్ పరంగా కూడా జాన్వీ జోరు కొనసాగుతోంది. ఇటీవల రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'పెద్ది' చిత్రంలో అచ్చియమ్మ పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పాత్రపై కొంత విమర్శలు వచ్చినప్పటికీ, ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.


Click it and Unblock the Notifications



