15 ఏళ్ల వయస్సులో ఆ అనుభవం.. ఆ సంఘటన ఇప్పటికీ వెంటాడుతోంది: జాన్వీ కపూర్
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ నటి శ్రీదేవి కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, తన నటనతో త్వరగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ, ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాతో మరోసారి టాలీవుడ్లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన 15 ఏళ్ల వయసులో చేదు అనుభవం ఎదురైందనీ, ఆ సంఘటన ఇప్పటికీ వెంటాడుతోందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
బాలీవుడ్ యంగ్ స్టార్ జాన్వీ కపూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె, తన టీనేజ్ రోజుల్లో ఎదుర్కొన్న అత్యంత బాధాకరమైన అనుభవాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా డీప్ఫేక్ (Deepfake), మార్ఫింగ్ టెక్నాలజీ వల్ల తాను చాలా చిన్న వయసులోనే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించింది.

జాన్వీ చెప్పిన ప్రకారం.. తాను కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ సమస్య మొదలైంది. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే, ఒక అశ్లీల వెబ్సైట్లో తన ఫోటోను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేశారని ఆమె తెలిపారు. ఐటీ క్లాస్ సమయంలో తోటి విద్యార్థులు ఆ ఫోటోలను చూసి మాట్లాడిన విధానం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.
'ఆ రోజు నాకు చాలా షాక్గా అనిపించింది. అప్పుడే ఇంటర్నెట్లో నైతికత అనే విషయం ఎంత తక్కువగా ఉందో అర్థమైంది' అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంఘటన తన జీవితంపై గాఢమైన ముద్ర వేసిందని జాన్వీ పేర్కొన్నారు. చిన్న వయసులోనే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల మానసికంగా చాలా బాధపడ్డానని, ఆ జ్ఞాపకం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని చెప్పారు. సెలబ్రిటీగా పుట్టినందుకు కొన్నిసార్లు ఇలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందని అప్పట్లో తనను తాను కంట్రోల్ చేసుకున్నాననీ వెల్లడించారు.
అయితే, సమస్య అక్కడితో ఆగిపోలేదని జాన్వీ తెలిపింది. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డీప్ఫేక్, ఏఐ ఆధారిత ఫోటోలు మరింత ప్రమాదకరంగా మారాయని ఆమె అన్నారు. "నేను ఎప్పుడూ చేయని పోజులు, నేను వేసుకోని దుస్తులతో నా ఫోటోలను సృష్టిస్తున్నారు. మరింత బాధ కలిగించే విషయం ఏమిటంటే.. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఆ నకిలీ ఫోటోలను నిజమని నమ్మి ప్రచురించడం'అని ఆమె పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు తన కెరీర్పైనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రభావం చూపుతున్నాయని జాన్వీ తెలిపారు. నకిలీ ఫోటోలు తాను షేర్ చేసినట్టుగా ప్రచారం జరగడం వల్ల తనపై అపోహలు ఏర్పడుతున్నాయని చెప్పారు. జాన్వీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే, జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉంది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు తన కెరీర్ చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేని జాన్వీ కపూర్.. పెద్ది సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇప్పటికే పెద్ది మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications




















