జీవితంలో నలిగిపోయా.. ఆ నలుగురి వల్లే.. జాన్వీకపూర్ షాకింగ్ కామెంట్స్
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు జాన్వీకపూర్. అందం, అభినయం పరంగా తల్లికి తగ్గ కూతురిగా గుర్తింపు తెచ్చుకుని స్టార్ రేసులో దూసుకెళ్తున్నారు. అయితే గత కొంతకాలంగా జాన్వీ కపూర్ వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమాలు డిజాస్టర్స్లా నిలవడంతో జాన్వీ కెరీర్ డైలామాలో పడింది. అయినప్పటికీ మొండిగా పోరాడుతున్నారు ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
వరుస ఫ్లాపులతో సతమతం
గతేడాది తెలుగులో ఎన్టీఆర్ కలిసి నటించిన దేవరతో హిట్ అందుకున్న జాన్వీ.. ఆ తర్వాత చేసిన హోంబౌండ్, పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచి ఆమె కెరీర్ను సందిగ్థంలో పడేశాయి. ప్రస్తుతం జాన్వీ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా తెలుగు చిత్రం కావడం గమనార్హం. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పెద్దిలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నెనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పెద్దిపైనే జాన్వీ ఆశలు
పెద్దిలో జాన్వీ కపూర్ ... అచ్చియ్యమ్మ అనే పాత్రలో నటిస్తున్నారు. లంగా ఓణీలో ఫైర్ బ్రాండ్గా, గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా ఆమె రోల్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇటీవల పెద్ది నుంచి విడుదల చేసిన జాన్వీ కపూర్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక చికిరి చికిరి అంటూ రామ్ చరణ్ వేసిన స్టెప్పులకు జాన్వీ కపూర్ గ్లామర్ మరింత ప్లస్ అయ్యింది. ఈ సినిమాపై జాన్వీకపూర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెద్ది హిట్ అయితే బాలీవుడ్తో పాటు సౌత్లోనూ గట్టిగా పాగా వేయొచ్చని ఆమె ఆశిస్తున్నారు. 2026 మార్చి 27న పెద్ది చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాజోల్కు షాకిచ్చిన జాన్వీ
సినిమాలు, గ్లామర్ మాత్రమే కాదు... ఎలాంటి అంశంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం జాన్వీకపూర్ స్టైల్. కొద్దిరోజుల క్రితం కాజోల్, ట్వింకిల్ ఖన్నా, కరణ్ జోహార్లు హోస్ట్లు వ్యవహరిస్తున్న టూ మచ్ టాక్ షోకు జాన్వీ కపూర్ గెస్ట్గా వచ్చారు. ఈ సందర్భంగా శారీరక సంబంధం, ఎమోషనల్ సంబంధం అనే అంశంపై చర్చ జరిగింది. పార్ట్నర్ ఫిజికల్ చీటింగ్ కంటే ఎమోషనల్ చీటింగ్ చేయడాన్ని పెద్ద ద్రోహంగా కాజోల్, కరణ్ జోహార్, ట్వింకిల్ లు అభిప్రాయపడ్డారు. అయితే జాన్వీ మాత్రం తన దృష్టిలో రెండూ తప్పేనని కరాఖండీగా చెప్పింది. ఈ ఆన్సర్తో జాన్వీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించగా.. పెద్దవాళ్లు అయ్యుండి చిన్న పిల్ల మనసుని పాడు చేస్తున్నారని చురకలంటించారు.
ఆ నలుగురితో నలిగిపోయా
తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ బార్కా దత్ ముంబైలో నిర్వహించిన వి ద ఉమెన్ సదస్సుకు హాజరైన జాన్వీకపూర్.. మహిళా సాధికారత, స్త్రీ పురుష సమానత్వం, వేధింపులు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నా.. వాళ్లు బలహీనులు కాదు, సాహసం కలిగిన వారు, శక్తివంతులు. నలుగురు మహిళల మధ్య నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా, నేరుగా చెప్పగలగుతున్నా. కానీ నలుగురు పురుషులు ఉన్నచోట మాత్రం చాలా జాగ్రత్తగా, వాళ్ల మనసులు గాయపడకుండా, ఇబ్బంది పడకుండా మాట్లాడాలి. సినీరంగంలో ఉన్న ఓ మహిళగా నేను ఈ విషయంలో ఎంతో నలిగిపోయా. పరిశ్రమలో మహిళలతో వ్యవహరించే విధానంలో మార్పులు రావాలి అని జాన్వీకపూర్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జాన్వీకపూర్కు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మద్ధతుగా నిలిచారు.


Click it and Unblock the Notifications











