నా జీవితానికి అసలైన అర్థం ఇదే.. శ్రీదేవి గుర్తొచ్చేలా.. జాన్వీ ఎమోషనల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నిర్మాత సతీష్ కిలారు తదితరులు హాజరయ్యారు. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
సాధారణంగా బాలీవుడ్ నుంచి వచ్చిన నటీమణులు తెలుగు వేదికలపై ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడటం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ జాన్వీ కపూర్ మాత్రం తెలుగులో మాట్లాడేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించడం అభిమానులను ఆకట్టుకుంది. తెలుగు అభిమానుల హృదయాలను గెలుచుకుంది. వేదికపై మాట్లాడిన జాన్వీ, తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలపై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'మీరు మాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. 'పెద్ది' సినిమా చూసిన తర్వాత కూడా ఇదే ప్రేమతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశిస్తున్నాను. అదే మాకు ప్రతిరోజూ కష్టపడి పని చేయడానికి బలం ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని అలరించడానికే' అని చెప్పింది.

సినిమా సందేశం గురించి మాట్లాడుతూ.. 'పెద్ది' కేవలం వినోదాత్మక చిత్రం మాత్రమే కాదు. మన జీవితానికి అర్థం ఏమిటి? మన గుర్తింపు ఏమిటి? అనే విషయాలను ఆలోచింపజేసే సినిమా. నా జీవితానికి అర్థం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం. నా గుర్తింపు కూడా మీ అందరితో, ఈ నేలతో బంధం ముడిపడి ఉంది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని భావోద్వేగంగా పేర్కొంది.
'ఈ సినిమా రిలీజ్కు ముందే నాకు చాలా ఇచ్చింది. రామ్ చరణ్ గారితో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చింది. ఆయన నిజంగా ఒక జెమ్. అద్భుతమైన నటుడు. బుచ్చిబాబు గారు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ దర్శకుల్లో ఒకరు. రత్నవేలు గారు నా ఫేవరెట్ డీఓపీ. ఏఆర్ రెహమాన్ గారు ఒక లెజెండ్. నిర్మాత సతీష్ గారు ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు'అంటూ కృతజ్ఞతలు తెలిపింది.
ఇంకా మాట్లాడుతూ, "మీరు మా సినిమాల కోసం థియేటర్లకు వస్తే మా కష్టానికి నిజమైన ఫలితం దొరికినట్లే. ఈసారి మీరు నన్ను మరికొంచెం ఎక్కువసేపు చూస్తారు. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను" అని చెప్పింది. ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికర సంఘటన కూడా చోటుచేసుకుంది. యాంకర్ సుమ కనకాల, చిరంజీవి-శ్రీదేవి నటించిన క్లాసిక్ చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లోని ప్రసిద్ధ 'మానవా మానవా' డైలాగ్ చెప్పమని జాన్వీని కోరింది.
వెంటనే జాన్వీ తనదైన శైలిలో "మానవా... ఒక్కసారి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా" అంటూ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించింది. ఆమె తెలుగు ఉచ్చారణ, ఆత్మవిశ్వాసం చూసి అభిమానులు హర్షధ్వానాలు చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో జాన్వీ సంప్రదాయ చీరకట్టులో మెరిసింది. ట్రెడిషనల్ లుక్లో స్టేజ్పై కనిపించిన ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ప్రత్యేకంగా అభినందించారు. సోషల్ మీడియాలో కూడా జాన్వీ స్పీచ్ వైరల్ అవుతోంది.
'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే పాత్రలో నటిస్తోంది. రామ్ చరణ్కు జోడీగా ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండనుందని సమాచారం. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ప్రచార చిత్రాలకు భారీ స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications






