దీపికాకు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్? కల్కీ వివాదం మళ్లీ తెరపైకి!
సినిమా పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత చర్చనీయమైన అంశాల్లో వర్క్ కల్చర్ ఒకటి. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో పని గంటలు, షూటింగ్ విధానం, ఆర్టిస్టులపై ఉండే ఒత్తిడి వంటి అంశాలపై తరుచు చర్చ జరుగుతునే ఉంటుంది. అయితే, ఈ చర్చకు కేంద్రబిందువుగా నిలిచింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. స్పిరిట్, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్ట్ల నుంచి ఆమె తప్పుకున్నారనే వార్తలు వచ్చిన తర్వాత.. పని గంటల వివాదం ఇండస్ట్రీ మొత్తం చర్చనీయంగా మారుతుంది.
దీపికా పదుకొణె రోజుకు పరిమిత గంటలే పని చేయాలనే నిబంధన పెట్టారని, షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తాయని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో టాలీవుడ్ వర్క్ కల్చర్పై రకరకాల కథనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో రోజుకు 12 నుంచి 14 గంటల పాటు షూటింగ్లు జరుగుతాయని, ఆర్టిస్టులపై భారీ ఒత్తిడి ఉంటుందని కొందరు వ్యాఖ్యానించారు. అయితే, ఈ వివాదంపై తాజాగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి.

'దేవర' సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె టాలీవుడ్లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. తెలుగు సినిమా సెట్స్లో సమయపాలనకు చాలా ప్రాధాన్యత ఇస్తారని, పనిగంటలను చాలా క్రమబద్ధంగా ప్లాన్ చేస్తారని ఆమె వెల్లడించింది. నటీనటులతో పాటు టెక్నీషియన్ల సంక్షేమాన్ని కూడా ఇక్కడ ఎంతో గౌరవిస్తారని పేర్కొంది.
జాన్వీ మాటల్లో చెప్పాలంటే.. టాలీవుడ్లో లంచ్ బ్రేక్ అనేది కేవలం పేరుకే ఉండదట. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకునేలా ప్రత్యేక సమయం కేటాయిస్తారట. ఆ తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొనడం వల్ల పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని ఆమె అభిప్రాయపడింది. అంతేకాకుండా దేవర, పెద్ది సినిమాల షూటింగ్ సమయంలో తాను రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదని స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జాన్వీ వ్యాఖ్యలు పరోక్షంగా దీపికా పదుకొణె అభిప్రాయాలకు సమాధానంగా మారాయా? అనే ప్రశ్న నెటిజన్లలో చర్చకు దారితీసింది. ఎందుకంటే గతంలో టాలీవుడ్ వర్క్ కల్చర్పై ఏర్పడిన నెగెటివ్ ప్రచారానికి విరుద్ధంగా జాన్వీ చాలా పాజిటివ్గా స్పందించింది. దీంతో ఇద్దరు హీరోయిన్ల అనుభవాలు, అభిప్రాయాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది.
అయితే ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నదేమిటంటే.. ప్రతి సినిమా, ప్రతి దర్శకుడు, ప్రతి ప్రొడక్షన్ హౌస్ వర్కింగ్ స్టైల్ వేర్వేరుగా ఉంటుంది. ఒక సినిమా అనుభవాన్ని మొత్తం ఇండస్ట్రీకి వర్తింపజేయడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడుతున్నారు. భారీ యాక్షన్ సినిమాలు, పాన్ ఇండియా ప్రాజెక్టులు, విదేశీ లొకేషన్లలో జరిగే షూటింగ్లు సాధారణ సినిమాల కంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక్కో ఆర్టిస్ట్కు ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతుందని అంటున్నారు. జాన్వీ వ్యాఖ్యలు మరి ఎలాంటి చర్చను దారి తీస్తాయో వేచిచూడాలి.
ఇక మరోవైపు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' పాత్రలో కనిపించనుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో జాన్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమాకన్నా ఎక్కువగా చర్చనీయాంశంగా మారాయి.


Click it and Unblock the Notifications





