నాకు బుద్ధి లేదు.. నా కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పు అదే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బాక్సాఫీస్ను షేక్ చేసిన ఓ బ్లాక్బస్టర్ సినిమాను తానే వదులుకుందని ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 'అది నా కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పు' అని అంగీకరించింది. అప్పట్లో చిన్న ప్రాజెక్ట్ అనిపించినా రిలీజ్ తర్వాత మాత్రం భారీ విజయాన్ని అందుకుని వందల కోట్ల వసూళ్లు సాధించింది. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో అనుభవం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపింది. ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద ప్రభావం చూపుతుందోనని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె మిస్ చేసిన సినిమా ఏది?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చిట్టి క్యారెక్టర్తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇలా ఈ మూవీతో ఫరియా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత చిట్టి పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా మెప్పించలేకపోయాయి. ఇక గత ఏడాది ఈ అమ్మడు కల్కి(Kalki), ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా-2 (Mathu Vadalara- 2)వంటి మూవీస్ చేసింది. ప్రస్తుతం 'గాయపడ్డ సింహం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

'గాయపడ్డ సింహం' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరియా మాట్లాడుతూ.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న హనుమాన్ (HanuMan) సినిమాలో నటించే అవకాశాన్ని తానే వదులుకున్నానని, తన కెరీర్లో చేసిన ఒక పెద్ద తప్పును ఆమె బహిరంగంగా ఒప్పుకుంది. ఈ విషయాన్ని ఆమె తన జీవితంలోనే అతిపెద్ద "రిగ్రెట్"గా పేర్కొన్నారు. "అప్పుడు నాకు కథలను ఎలా అంచనా వేయాలో తెలియదు. నిజంగా చెప్పాలంటే నాకు బుద్ధి లేదు... నేను చేసిన పెద్ద తప్పు అదే' అంటూ తనపై తానే విమర్శలు చేసుకుంది. ఇండస్ట్రీలో కొత్తగా అడుగుపెట్టిన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకునే అనుభవం లేకపోవడం వల్ల ఈ అవకాశాన్ని కోల్పోయానని ఆమె చెప్పింది.
ముఖ్యంగా తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మలను ఎక్కడైనా కలిసినప్పుడు ఈ విషయం గుర్తుకు వస్తుందని, ఆ సినిమా మిస్ అయ్యానని ఇప్పటికీ బాధపడుతుంటానని వెల్లడించింది. ఇలా 'హనుమాన్' సినిమా ఆఫర్ను తిరస్కరించడంఆమె కెరీర్లో మిస్ అయిన గోల్డెన్ ఛాన్స్గా మారింది. ఈ సినిమాలో చివరకు అమృత అయ్యర్ హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. సుమారు 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పాన్ ఇండియా స్థాయిలో నయా హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకోవడం 'హనుమాన్'కు ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
ప్రస్తుతం 'గాయపడ్డ సింహం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఫరియా, ఇకపై కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుని తనకు తగిన స్థానం సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయిన బాధ ఉన్నప్పటికీ, అదే అనుభవాన్ని పాఠంగా తీసుకుని ముందుకు సాగాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications