ఆ హీరోని పిచ్చోడిలా ... జయసుధ తప్పు ఖరీదు 300 కోట్లు, జీవితాన్ని చేజేతులా
జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు భారీ నష్టాలను మిగుల్చుతాయి. కొన్నిసార్లు జీవితమే కోల్పోవచ్చు కూడా. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆచితూచి అడుగులు వేయాలని పెద్దలు చెబుతుంటారు. పెద్దవాళ్లు ఇచ్చే సలహాలను కొట్టిపడేయకుండా వాటిని పరిగణనలోకి తీసుకోవాలని చాలా మంది జీవితాలు మనకు గుణపాఠాలుగా కనిపిస్తాయి. తాజాగా సీనియర్ నటి జయసుధ అలా ఓ తప్పు చేసి ఏకంగా రూ.300 కోట్లకు పైగా నష్టపోయారట. ఈ వివరాల్లోకి వెళితే.
తెలుగు చిత్ర పరిశ్రమలో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు జయసుధ. తన అందం, అభినయంతో తెలుగు వారి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దాదాపు ఐదు దశాబ్ధాలుగా వందలాది చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. టాలీవుడ్లో మూడు తరాల నటులతో కలిసి నటించిన అరుదైన ఘనత జయసుధది. 1958 డిసెంబర్ 17న చెన్నైలో జన్మించిన జయసుధకు .. నటి, దిగ్గజ దర్శకురాలు విజయ నిర్మల దగ్గరి బంధువు. ఈ క్రమంలో విజయ నిర్మల - కృష్ణ నటించిన పండంటి కాపురం సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. ఈ సినిమా సమయానికి ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే కావడం గమనార్హం.

అనంతరం తమిళ దర్శక దిగ్గజం కే. బాలచందర్ దర్శకత్వంలో అరంగేట్రం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో కంటతడి పెట్టించారు. నాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులతో నటించారు. అప్పట్లో ఇద్దరు హీరోయిన్ల సినిమా అంటే ఖచ్చితంగా జయసుధ ఉండాల్సిందే అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ కలిపి వందలాది చిత్రాల్లో జయసుధ నటించారు.
బాలీవుడ్ స్టార్ జితేంద్ర సోదరుడు నితిన్ కపూర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు జయసుధ. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో చిన్న కుమారుడు శ్రేయాన్ హీరోగానూ నటించారు. నితిన్ కపూర్తో కలిసి జేకే ఫిలిమ్స్ పేరిట నిర్మాణ రంగంలోనూ అడుగులు వేసిన ఆమె పలు చిత్రాలు నిర్మించారు. అయితే అనూహ్య కారణాల మధ్య నితిన్ కపూర్ 2017లో ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మరణంతో జయసుధ బాగా కృంగిపోయారు. ఇక రాజకీయాల్లోనూ జయసుధ సక్సెస్ అయ్యారు. తొలుత ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్లో చేరి 2009లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర విభజనతో మరోసారి టీడీపీ గూటికి వచ్చారు.
సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దుమ్మురేపుతున్నారు జయసుధ. దక్షిణాదిలో ఆమె ఇప్పుడు మోస్ట్ వాంటెడ్. 70కి చేరువ అవుతున్నా నేటికీ చెక్కు చెదరని గ్లామర్తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు జయసుధ. ఇన్నేళ్ల కెరీర్లో బాగానే డబ్బును , ఆస్తులను కూడబెట్టడంతో పాటు తప్పుడు నిర్ణయాలతో వందల కోట్లను పొగొట్టుకున్నారు కూడా. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయసుధ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలు నిర్మించి కోట్లు పొగొట్టుకున్నట్లుగానే.. చెన్నైలో ఓ స్థలం విషయంలోనూ జరిగిందన్నారు.
ఆంధ్రుల సోగ్గాడు శోభన్ బాబుతో ఎక్కువ చిత్రాల్లో నటించిన జయసుధకు ఆయన ఎన్నో విలువైన సలహాలు ఇచ్చేవారు. ఈ క్రమంలో ఓ రోజున వీరిద్దరూ కారులో వెళ్తుండగా జయసుధకు శోభన్ ఓ స్థలం చూపించి అద కొనుక్కోమన్నారు. అయితే అక్కడ అంతా చెత్త వేయడంతో అది డంపింగ్ యార్డ్లా మారింది. దీనిని త్వరలో ప్రభుత్వం శుభ్రం చేసి కమర్షియల్ స్పేస్గా మారుస్తుందని శోభన్ తెలిపారట.
అయితే ఇలాంటి ప్లేస్లో కొనమంటాడేంటీ ఈయనకి పిచ్చా అని శోభన్ బాబు మాటలను పట్టించుకోలేదు జయసుధ. అదే చెన్నైలోని నేటీ అన్నానగర్. ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్ల పైమాటే. అప్పుడు రెండు మూడు ఎకరాలు కొనుగోలు చేసున్నా నేడు ఆ ఆస్తి విలువ 200 కోట్ల నుంచి 300 కోట్ల పైమాటే ఉండేది. శోభన్ బాబు చెప్పిన మాట పట్టించుకోక పోవడం వల్ల తాను కోట్లలో నష్టపోయానని జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











