కొడుకు కోసం కాజల్ సంచలన నిర్ణయం... ఇకపై అలాంటి సినిమాలే టార్గెట్..
Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్ష్మీ కళ్యాణం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చందమామ సినిమాతో అందరి మనసు దోచేసింది. ఇక మగధీర మూవీలో మిత్రవిందగా తన అందం, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఇక కెరీర్ పీక్స్లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఈ జంట కొడుకుకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మదర్హుడ్ తర్వాత తన ఆలోచనా విధానం, కెరీర్పై దృష్టి, కథల ఎంపిక పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ తల్లి అయిన తర్వాత తనలో వచ్చిన మార్పులు, సినిమాల ఎంపిక వెనుక కారణాలు, తన కుమారుడు నీల్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు కథ నచ్చితే వెంటనే సినిమా ఒప్పుకునేదాన్నని, కానీ ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ను తన కుమారుడు నీల్ దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం 'ది ఇండియా స్టోరీ', 'రామాయణ: పార్ట్ 1' వంటి సినిమాలతో బిజీగా ఉన్ననని కాజల్ అన్నారు.

కాజల్ 'మదర్హుడ్ తన జీవితాన్ని మాత్రమే కాదు.. కెరీర్ను కూడా పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు ఏ సినిమా ఒప్పుకునే ముందు "ఈ సినిమాను నా కొడుకు పెద్దయ్యాక చూసి గర్వపడతాడా? 'మమ్మా చేసిన గొప్ప సినిమా' అని చెప్పుకుంటాడా?" అనే కోణంలోనే ముందుగా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అందుకే స్క్రిప్ట్ల ఎంపికలో గతంతో పోలిస్తే మరింత బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. కేవలం కమర్షియల్ అంశాలకే కాకుండా, కథ, పాత్ర ప్రాధాన్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
మరోవైపు.. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'రామాయణ: పార్ట్ 1'లో కాజల్ మండోదరి పాత్రలో నటిస్తున్నారు. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలో భాగం కావడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభవమని కాజల్ చెప్పారు.
ఈ సందర్భంగా తన కుమారుడు నీల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కొడుకు నీల్కు చిన్నప్పటి నుంచే రామాయణం అంటే ఎంతో ఇష్టమని, ఇంట్లో ప్రతిరోజూ రామలీల చూస్తుంటాడని చెప్పారు. తాను 'రామాయణ' సినిమాలో నటిస్తున్నానని చెప్పగానే చాలా ఉత్సాహపడ్డాడని తెలిపారు. అయితే అందరికంటే ఆసక్తికర విషయం ఏమిటంటే.. నీల్కు శ్రీరాముడి పాత్ర కంటే రావణుడి పాత్రే ఎక్కువ ఇష్టమని నవ్వుతూ చెప్పారు. యశ్ పోషిస్తున్న రావణుడి పాత్రపై అతనికి ప్రత్యేకమైన ఆసక్తి ఉందన్నారు.
అంతేకాదు, 'రామాయణ: పార్ట్ 2' విడుదలయ్యే సమయానికి నీల్కు ఐదేళ్లు వస్తాయని, థియేటర్లో తన కుమారుడు చూసే మొదటి సినిమా అదే అవుతుందని కాజల్ చెప్పారు. తన కుమారుడు పెద్ద తెరపై తనను మండోదరిగా చూసే క్షణం కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కాజల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కాజల్ నటించిన 'ది ఇండియా స్టోరీ' జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. చేతన్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రేయస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తుండగా, కాజల్ ఓ న్యాయవాదిగా కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications



