16 ఏళ్ల వయసులో చేదు అనుభవం.. వేధింపులు భరించలేక రాయితో తల పగలగొట్టా!
యంగ్ హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ అస్సాం భామ.. ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారింది. ముఖ్యంగా తమిళంలో విడుదలైన 'డ్రాగన్' సినిమా ఆమె కెరీర్కు టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ ఒక్క సినిమాతో కాయదు ఓవర్నైట్ స్టార్గా మార్చేసింది. ఈ సక్సెస్ తో మూవీ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం స్టార్ హీరో సూర్యతో ఓ భారీ ప్రాజెక్ట్తో పాటు నేచ్యురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తుంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాయదు మాట్లాడుతూ.. తన పర్సనల్ లైఫ్ తో పాటు తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ సమయంలో తన టీనేజ్ లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించారు. సాధారణంగా గ్లామర్, సినిమాల గురించి మాట్లాడే హీరోయిన్లు వ్యక్తిగతంగా ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటపెట్టడం అరుదు. కానీ కాయదు మాత్రం తన పదో తరగతి రోజుల్లో జరిగిన ఒక ఈవ్ టీజింగ్ ఘటనను ఏమాత్రం దాచకుండా పంచుకుంది. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాయదు లోహర్ మాట్లాడుతూ.. 'నేను పదో తరగతి చదువుతున్న సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న ట్యూషన్ సెంటర్కు ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్లేదాన్ని. ఆ సమయంలో కొందరు యువకులు నన్ను తరచూ ఫాలో అవుతూ ఈవ్ టీజింగ్ చేసేవారు' అని గుర్తుచేసుకున్నారు. అయితే.. ఆ విషయాన్ని మొదటి అంతగా పట్టించుకోలేదు. రెండో రోజు కూడా అదే పరిస్థితి ఎదురైనా సహనంతో వదిలేశాను. వాళ్లు మానేస్తారనుకున్నాను. అనవసరంగా గొడవ పెట్టుకోవడం ఎందుకనిపించింది" అని ఆమె చెప్పింది.
'అయితే మూడో రోజు కూడా అదే యువకుడు వెంటపడి మరింత హద్దులు మీరి ప్రవర్తించాడు. ఆ సమయంలో నాలో కోపం ఒక్కసారిగా ఉప్పొంగింది. భయం,ఆవేదన, కోపం అన్నీ ఒక్కసారిగా కలిసిపోయాయి. ఆవేశంలో రోడ్డు పక్కన కనిపించిన పెద్ద రాయిని తీసుకుని ఆ యువకుడి వైపు విసిరేశాను. ఆ రాయి అతని తలకు బలంగా తగలడంతో రక్తం కారింది. ఆ తర్వాత భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని గుర్తు చేసుకుంది. అయితే.. " ఆ విషయాన్ని ఇప్పుడు ఆలోచిస్తే ఒకరి తల పగలగొట్టడం సరైన పని కాదు. హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కానీ ఆ వయసులో నేను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, భయం అలా స్పందించేలా చేశాయి" అని చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరలవుతున్నాయి.
కాయదు లోహర్ సినీ కెరీర్ పరిశీలిస్తే.. కన్నడ సినిమా 'మొగిల్పేట'తో హీరోయిన్గా పరిచయమైంది. తెలుగులో 'అల్లూరి'సినిమాతో అడుగుపెట్టింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో టాలీవుడ్లో వెంటనే అవకాశాలు రాలేదు. అయినా నిరాశ చెందకుండా తమిళం, మలయాళ ఇండస్ట్రీలో ప్రయత్నాలు కొనసాగించింది. ఆ క్రమంలో ప్రదీప్ రంగనాథ్ హీరోగా తెరకెక్కిన 'డ్రాగన్'సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఈసినిమా ఆమె కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా సక్సెస్ తో మంచి గుర్తింపు రావడంతో పాటు వరుస అవకాశాలు ఆమె తలుపు తట్టాయి.
ప్రస్తుతం కాయదు లోహర్ నటించిన 'ఇధయం మురళి'విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అధర్వ మురళి హీరోగా నటించగా, ప్రీతి ముకుందన్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే 'ఇమ్మోర్టల్', 'ఐ యామ్ గేమ్','ఖలీఫా'సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక తెలుగులో నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా ఆమె కెరీర్లో అత్యంత కీలక సినిమాగా మారబోతుందని భావిస్తున్నారు. ఈ సినిమా విజయవంతమైతే కాయదు లోహర్ పాన్ ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ సంపాదించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications




