వాళ్లు నా వెనుక పడుతున్నారు.. నా పరిస్థితి ఎలా ఉందంటే.. కియారా అద్వానీ
బాలీవుడ్ నటి కియారా అద్వానీ కెరీర్ గ్రాఫ్ రివ్వును దూసుకెళ్తున్నది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిర్మించిన కియారా తొలి చిత్రం ఫగ్లీ నిరాశపరిచినప్పటికీ ఆమె కెరీర్ గ్రాఫ్ సవ్యంగానే సాగుతున్నది. దక్షిణాదిలోనూ భారీ హీరోల సరసన నటిస్తున్నది. ఆమె నటించిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చిత్రం జూన్ 21న రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో కియారా మీడియాతో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి కొన్ని విషయాలు పంచుకొన్నది. అవేమిటంటే..

అప్పుడు ముఖం చాటేసి
నా తొలి చిత్రం సరిగా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. చాలా మంది నాతో పనిచేయడానికి ముందుకు రాలేదు. నా తొలి సినిమా ఫ్లాప్ కావడం వల్ల కొందరు డైరెక్టర్లను కలిస్తే ముఖం చాటేశారు. వాళ్లే ఇప్పుడు నాతో పనిచేయడానికి ముందుకొస్తున్నారు. అప్పుడు పరిస్థితులు అలా విచిత్రంగా మారిపోతుంటాయి. ఓడలు బళ్లు అవుతాయంటే ఇదేనేమో అని కియారా అన్నారు.

మలుపు తిప్పిన సినిమా అదే
ఎంఎస్ ధోని నా జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా. ఆ సినిమా హిట్ కావడంతో ఇండస్ట్రీ నావైపు దృష్టి సారించింది. ఆ తర్వాత నేను నటించిన మెషిన్ సినిమా కమర్షియల్గా హిట్ కాకపోయినా ఆ సినిమాలోని చీజ్ బడీ హై మస్త్ మస్త్ పాట అందర్నీ ఆకట్టుకొన్నది. దక్షిణాదిలో నేను నటించిన సినిమాలు నాకు మంచి పాపులారిటీ సంపాదించాయి. లస్ట్ స్టోరీస్ సినిమా బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు కల్పించాయి అని కియారా చెప్పారు.

భాషతో సంబంధం లేకుండా
నేను ఓ భాషకో, ఓ మీడియానికో పరిమితం కాదలుచుకోలేదు. నేను దేశంలో ఏ భాషలోనైనా నటించే నటిని అని పేరుతెచ్చుకోవాలి. మహేష్తో భరత్ అనే నేను, రాంచరణ్తో వినయ విధేయ రామ చిత్రాలు నాకు మంచి పేరు సంపాదించాయి. ఉత్తరాది అమ్మాయిని అని దక్షిణాది ప్రేక్షకులు పట్టించుకోలేదు. ప్రతిభ ఉంటే చాలా అవకాశాలు ముందు వచ్చి వాలిపడుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు అని కియారా అన్నారు.

ఎప్పుడు, ఎక్కడ అవకాశాలు ఉంటాయో
నాకు భాష అవరోధం కాదు. నేను పాన్ ఇండియా ఆర్టిస్టునని నిరూపించుకోవాలి. సరైన కంటెంట్ కోసం నేను ఎదురుచూస్తుంటాను. అలాగే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటాను. సినిమా పరిశ్రమలో ఏ కంటెంట్ను ఎవరు, ఎప్పుడు ఆదరిస్తారో అనేది చెప్పడం కష్టం. నాకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకొనేందుకు ప్రయత్నిస్తాను అని కియారా చెప్పారు.


Click it and Unblock the Notifications











