ఆ 6 నెలలు నరకం చూశా.. రామ్ చరణ్ బ్యూటీ ఎమోషనల్ కామెంట్స్
'కియారా అద్వానీ' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో విడుదలైన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తెలుగులో ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకున్నారు. చివరగా రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. పెళ్లి తర్వాత సినిమాల మీద ఫోకస్ తగ్గించారు. అయితే.. తాజాగా కియారా అద్వానీ చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా ఆ సమయంలో నరకం అనుభవించా అంటూ చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?
కియారా అద్వానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులై నెలలో కుమార్తె సారాయా జన్మించిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత జీవితంలో వచ్చిన మార్పులు తనను పూర్తిగా మార్చేశాయని కియారా వెల్లడించింది. ప్రముఖ పోడ్కాస్ట్ హోస్ట్ రాజ్ షమాని తో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తన మనసులోని బాధను బయటపెట్టింది.

"మొదటి ఆరు నెలలు నేను నరకం చూశాను. నాపై నాకు జాలి చూపించుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించేది. చిన్న చిన్న విషయాలకే ఏడుపొచ్చేది. నా భావోద్వేగాలను కంట్రోల్ చేయలేకపోయేదాన్ని" అంటూ కియారా ఎమోషనల్ అయింది. తల్లి అయిన తర్వాత తన "ఐడెంటిటీ" పూర్తిగా మారిపోయిందని ఆమె తెలిపింది. ఇంతకాలం కుటుంబం, పని, ఇతరుల గురించి మాత్రమే ఆలోచించిన తాను.. మొదటిసారి తన కోసం కూడా సమయం కేటాయించుకోవాల్సిన అవసరం అర్థమైందని చెప్పింది. "నాలోని భావాలను అర్థం చేసుకోవడం, నన్ను నేను ప్రేమించుకోవడం ఈ మాతృత్వం నేర్పింది" అని చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కష్ట సమయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అందించిన సపోర్ట్ గురించి చెప్పినప్పుడు కియారా మరింత భావోద్వేగానికి గురైంది. "సిద్ధార్థ్ తన సినిమా ప్రమోషన్స్తో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి రాత్రి నా దగ్గరకు వచ్చేవాడు. డాక్టర్ సూచన మేరకు నన్ను డ్రైవ్కు తీసుకెళ్లేవాడు. ఆ చిన్న డ్రైవ్స్ నాకు ఎంతో మానసిక ప్రశాంతత ఇచ్చాయి" అని ఆమె చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో "హస్బెండ్ గోల్స్" అంటూ సిద్దార్థ్పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే.. తల్లైన తర్వాత కూడా కియారా వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె Toxic సినిమాలో నటిస్తోంది. యష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి సున్నితమైన విషయాలను బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ కియారా మాత్రం తల్లితనం తర్వాత మహిళలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిపై బహిరంగంగా మాట్లాడటం ఇప్పుడు ఎంతో మందికి కనెక్ట్ అవుతోంది.


Click it and Unblock the Notifications



