వివాదాల మధ్య పెదవి విప్పిన పూనమ్ కౌర్.. ప్రకాశ్ రాజ్ను టార్గెట్ చేస్తూ పంజాబీ భామ ట్వీట్
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నా తర్వాత నటిగా రాణించలేకపోయింది పంజాబీ భామ పూనమ్ కౌర్. ఒకరకంగా తెలుగు నాట పూనమ్ కౌర్ సృష్టించిన వివాదాలు అంతా ఇంతా కాదు. ఆమె ఏదీ కూడా సరిగా చెప్పదు కానీ వేయాల్సిన పంచ్లు వేసేస్తుంది. అది ఎవరి గురించి వేస్తుందో అనేది కూడా ఈజీగా అర్ధమవుతూ ఉంటుంది. వాటిని తరువాత పూనమ్ కౌరే డిలీట్ చేయడమో, కాదని ఖండించడమో చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

అలా సినిమాల్లోకి ఎంట్రీ
ఒకప్పటి తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన అప్డేట్స్ను, తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా ఫాలోవర్స్తో, ఫ్యాన్స్తో పంచుకుంటూ ఉంటారు. ఆమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలైనా వివాదాస్పద అంశాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకుంది. టాలీవుడ్ లో 'మాయాజాలం' సినిమాతో ఎంటరైన పూనమ్ ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన 'ఒక విచిత్రం' సినిమాలో నటించి బాగానే పాపులర్ అయింది.

సినిమాల విషయానికి వస్తే
ఇక ఆ తర్వాత వినాయకుడు.. నాగార్జున నటించిన 'గగనం' గోపీచంద్ నటించిన 'శౌర్యం' వెంకటేష్ నటించిన 'నాగవల్లి' సినిమాలతో పాటు 'ఎటాక్' 'శ్రీనివాస కళ్యాణం' వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలన్ని పూనమ్ కి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టలేదు కానీ నటిగా అయితే చాలా మంచి పేరు తెచ్చాయి. ఇక పూనమ్ కెరీర్ సినిమాల పరంగా కాస్త స్లో అవడంతో స్మాల్ స్క్రీన్ మీద 'స్వర్ణ ఖడ్గం' అనే సీరియల్ లో చేసింది.

ఆ డైరెక్టర్ కారణంగా
ఆ సీరియల్ ఇప్పుడు రావడం లేదు కానీ ఆమె సెన్సేషనల్ కామెంట్స్ తోనే ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే కొన్ని సార్లు అవసరం లేకపోయినా అన్ని విషయాల మీద కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉంటుంది పూనమ్. ఆ మధ్య టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి వల్లే తన జీవితం చిన్నాభిన్నం అయిందని తన వల్ల ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయానని .. పర్సనల్ లైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అయిందని వాపోయింది. ఆ తర్వాత కొంత సైలెన్స్ పాటించిన ఆమె ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయింది.

ప్రకాష్ రాజ్ కు పూనమ్ మద్దతు
అయితే మా ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్న క్రమంలో ఎంటర్ అయిన పంజాబీ భామ పూనమ్ కౌర్ ''ప్రకాష్రాజ్ సార్ మా ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నా, ఆయన గెలిస్తే నేను ఎదుర్కొన్న సమస్యలను నేను ఆయన ముందు పెడతాను, ఇంత కాలం నిశ్శబ్దంగా ఉన్నాను కానీ అవన్నీ ఆయన ముందు పెడతానని అన్నారు. అతను మాత్రమే రాజకీయాలకు లొంగకుంగా వాస్తవికంగా ఉంటాడని జైహింద్ అంటూ ఆమె రాసుకొచ్చింది. అయితే అసలు ఆమె ఏ విషయంలో సైలెంట్ గా ఉంది? ఆమె ప్రకాష్ రాజ్ ముందు ఏమి ఉంచనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల విషయానికి వస్తే
ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబందించి సెప్టెంబర్ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరణ చేయగా 30న నామినేషన్లు పరిశీలన జరిగింది. ఇక నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది. 2వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత అంతిమంగా మా ఎన్నికల రేసులో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండగా అదే రోజు రాత్రి 7 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











