పవన్ కళ్యాణ్ ఓటమి వింతగా విడ్డురంగా ఉంది, ప్రజల తీర్పు భలే భలే: మాధవి లత
2019 సార్వత్రిక ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి 350కిపైగా సీట్లు సాధించి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ప్రజల తీర్పు మేరకు మరో ఐదేళ్ల పాటు నరేంద్రమోదీ ప్రభుత్వం భారతదేశాన్ని పాలించబోతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే... అధికార తెలుగు దేశం పార్టీకి ఊహించని దెబ్బ తిగిలింది. 175 స్థానాలకగాను కేవలం 23 చోట్ల మాత్రమే గెలుపొందగా, జగన్ నేతృత్వంలోని వైసీపీ 150కిపైగా సీట్లలో నెగ్గి చారిత్రక విజయం సాధించింది. ఈ పరిణామాలపై తెలుగు సినీ నటి, బీజేపీ నుంచి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాధవి లత స్పందించారు.

నేను ఓడిపోతానని తెలుసు
నేను ఓడిపోతా అని నాకు తెలుసు, పార్టీ కి తెలుసు, మీకు తెలుసు, ముందుగానే తెల్సుకొని బాధ్యతగా పార్టీ కోసం పనిచేస్తున్నాను అని మొదటి నుండి చెప్పాను. ఎక్కడ కూడా నేను గెలుస్తాను అనే మాట వాడలేదు. మోడీ మళ్ళీ రావాలి అని కోరుకున్నాను, అలాగే వచ్చారు... అని మాధవి లత తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఓటమి నాకు వింతగా విడ్డురంగా ఉంది
పవన్ కళ్యాణ్ ఓటమి నాకు వింతగా విడ్డురంగా ఉంది. ఆయన ఓటమిని నేను జీర్ణించుకోలేక పోతున్నాను. ఫ్యాన్స్ ఏమయ్యారు? ఎన్ని మాటలు చెప్పారు? ఇదేనా మీ ప్రేమ.... అంటూ మాధవి లత తన సోషల్ మీడియా పేజీ ద్వారా కామెంట్స్ పోస్ట్ చేశారు.

డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాము, మాకు నిజాయితీ పరులొద్దని ప్రజలు భలే చెప్పారుగా
డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాము, మాకు నిజాయితీ పరులొద్దని ప్రజలు భలే చెప్పారుగా.. చదువుకున్న వారు రాజకేయాల్లోకి రావాలి అనేది మీరే, జేడీ లక్ష్మి నారాయణ గారు వచ్చారు? ఎందుకు ఓడించారు? విద్యార్థులు ఏమయ్యారు? మీ ఓట్లు ఏమయ్యాయి. డబ్బు కులం కావలి అని నిరూపించారుగా.. చదువు నీతి వొద్దు అని చెప్పేసారుగా? అంటూ.... ఏపీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి మాధవి లత వ్యాఖ్యానించారు.

ఇది ఈవీఎం మ్యాజిక్ కాదు
బీజేపీ అధికారంలోకి రావడాన్ని కొందరు... ఈవీఎం మాయగా పేర్కొనడంపై మాధవి లత ఫైర్ అయ్యారు. మోదీ గెలుపు వెనక ఈవీఎం మాయ ఉంటే 3 రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదు? అలాంటి ఆరోపణలు చేసే వారు ఒకసారి ఆలోచించండి. ఇది ప్రజల తీర్పు, ఈవీఎం మాయ ఏ మాత్రం కాదని మాధవి లత స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











