‘ఆ స్టార్ హీరోని పిచ్చిగా ప్రేమించా... అలా నా మనసు ముక్కలు చేసి’
భారతదేశంలో సినీ హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలను దేవుళ్లలాగా పూజిస్తారు అభిమానులు. మహిళా అభిమానులైతే హీరోలని పీకలదాకా ప్రేమించి వారిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారు. సేమ్ ఇలాగే అబ్బాయిలు కూడా. తమ కలల రాకుమారి లాంటి హీరోయిన్లను బాగా ఇష్టపడతారు. తారలకు పెళ్లిళ్లు అయిపోతే తట్టుకోలేరు. సామాన్యులే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఫేవరెట్ యాక్టర్స్ ఉంటారు. ఓ హీరోయిన్.. ఓ స్టార్ హీరోయిన్ పీకలదాకా ప్రేమించగా హీరో అన్న మాటలు ఆమె మనసును ముక్కలు చేశాయి. ఈ వివరాల్లోకి వెళితే..
90వ దశకంలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత శ్రీదేవికి స్వయానా అక్క కూతురే మహేశ్వరి. 17 ఏళ్ల వయసులో 1994లో భారతీరాజా దర్శకత్వంలో తమిళ చిత్రం కరుత్తమ్మ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మహేశ్వరి. అమ్మాయి కాపురం సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా ఆమెకు బ్రేక్ తీసుకొచ్చింది. దెయ్యం, మృగం, పెళ్లి, ప్రియరాగాలు, నవ్వులాట, ఓ పనైపోతుంది బాబు, మా బాలాజీ, రామసక్కనోడు, నీ కోసం, బలరాం, మా అన్నయ్య, నాగులమ్మ, తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రాలతో తెలుగువారిని అలరించారు మహేశ్వరి. 30 ఏళ్లకు పైగా కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు.

కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే అనూహ్యంగా వెండితెరకు దూరమయ్యారు మహేశ్వరి. 2000వ సంవత్సరంలో వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం సినిమా నటిగా ఆమెకు చివరి సినిమా. పాతికేళ్లు పైబడుతున్నా, ఎన్నో అవకాశాలు వస్తున్నాసరే మహేశ్వరి మాత్రం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 2008లో గుంటూరుకు చెందిన జయకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను మహేశ్వరి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సీరియల్స్, రియాలిటీ షోలతో ఆమె ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు.
90's బ్యాచ్ పేరుతో 1990లలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన హీరోయిన్ల క్లబ్లో మహేశ్వరి యాక్టీవ్గా ఉంటున్నారు. ప్రతియేటా ఖచ్చితంగా ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూనే ఉంటారు. నాటి హీరోయిన్లు సంఘవి, సిమ్రన్, మీనా, సంగీతలతో మహేశ్వరి బాగా క్లోజ్గా ఉంటారు. ఇక మీనాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మీనా భర్త విద్యాసాగర్ మరణించి ఆమె డిప్రెషన్లోకి వెళ్లగా.. మీనాను తిరిగి మామూలు మనిషిని చేయడంలో మహేశ్వరి కీలకపాత్ర పోషించారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్గా ఓ ఛానెల్లో ప్రసారమైన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో మీనా, సిమ్రన్లతో పాటు మహేశ్వరి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నా క్రష్ కూడా చెప్పొచ్చా? లేట్ అవుతుందా? అని మహేశ్వరి అనడంతో అంతా నవ్వేస్తారు. ఆశ చూపించి మోసం చేస్తున్నారని అనడంతో మహేశ్వరిని చెప్పమని అంటాడు. నా క్రష్ అజిత్ కుమార్. ఆయనను క్రష్ అనుకోండి ఏమైనా అనుకోండి, అజిత్ వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో గౌరవం. ఈ ప్రాసెస్లో నాకొక శాడ్ స్టోరీ కూడా ఉంది. క్రష్ అంటే ఆయనంటే ఇష్టం, రెండు సినిమాలు కలిసి చేశాం. ఒక సినిమా కొంచెం ఆలస్యం కావడంతో ఏడాదిన్నర పాటు కలిసి ట్రావెల్ చేశాం. ఇక అంతా అయిపోయింది.. ఆ సినిమా షూటింగ్ లాస్ట్ రోజున పేకప్. ఆయనను మళ్లీ కలవలేం, చూడలేమని తెలిసి బాధపడుతున్నా. ఇంతలో అజిత్ నా దగ్గరికొచ్చి మహి.. నువ్వు నా చెల్లెలు లాగా.. నీకు ఏం కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా నన్ను కలవమన్నారు. ఆ మాట చెప్పాక ఇక మనం ఏం చేయలేం కదా అని మహేశ్వరి చెప్పింది. ఇక అక్కడితో ఆగిపోయిందా అని జగపతి బాబు అడగ్గా.. ఏం స్టార్ట్ కాలేదు కదా ఆగడానికి అని మహేశ్వరి నవ్వేసింది. దాంతో జగపతిబాబు, మీనా, సిమ్రన్లు నవ్వేశారు. ప్రస్తుతం ఆ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications