టాలీవుడ్ హీరోతో అలాంటి రిలేషన్లో... సూపర్స్టార్ ముందు ఓపెన్ అయిన మీనాక్షి చౌదరి
ప్రస్తుతం టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నిన్నటి వరకు లవ్బర్డ్స్గా ఉన్న విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలాగే మార్చి 6వ తేదీన అల్లు శిరీష్- నయనిక రెడ్డిల వివాహం జరగనుంది. మరికొంతమంది స్టార్స్ కూడా ఇన్నాళ్లూ సీక్రెట్గా ఉంచిన తమ బంధాన్ని బయటపెట్టే పనిలో ఉన్నారు. స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి విషయంలోనూ ఓ గాసిప్ గత కొన్నేళ్లుగా వైరల్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి కీలక వ్యాఖ్యలు చేశారు.
తన అందం, అభినయంతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకున్నారు మీనాక్షి చౌదరి. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలామంది నటీనటులు చెప్పినవారే, అలాంటిది డాక్టర్ చదివి తర్వాత నటన వైపు వచ్చిన అతికొద్దిమంది స్టార్స్లో మీనాక్షి చౌదరి ఒకరు. మోడలింగ్తో కెరీర్ ప్రారంభించిన మీనాక్షి.. తొలుత చిన్నాచితకా సినిమాలు చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

2019లో హిందీ సినిమా 'అప్స్టార్ట్స్'తో వెండితెరకు పరిచయమైన మీనాక్షి, 2021లో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఆ తర్వాత ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, మట్కా, మెకానిక్ రాకీ వంటి సినిమాల్లో నటించారు. ఈ దశలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'లక్కీ భాస్కర్' ఆమె కెరీర్కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్దినెలల గ్యాప్లో విక్టరీ వెంకటేష్తో కలిసి నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో మరో బ్లాక్బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లింది. ఈ ఏడాది సంక్రాంతికి మరోసారి అనగనగా ఒకరాజుతో హిట్ అందుకుని లక్కీ లేడీగా మారిపోయారు మీనాక్షి చౌదరి.
తెలుగుతో పాటు తమిళంలో ది గోట్, సింగపూర్ సెలూన్, కోలై వంటి సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న వృషకర్మలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె రోల్కు సంబంధించిన ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది. కెరీర్ పరంగా పీక్స్లో ఉన్న మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడాలని భావిస్తున్నారని గాసిప్స్ వస్తున్నాయి. ఓ ప్రముఖ తెలుగు హీరోతో ఆమె కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని మీడియాలో గాసిప్స్ వచ్చాయి.
ఆ హీరో ఎవరో కాదు.. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుశాంత్. ఇతను హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీతోనే మీనాక్షి చౌదరి టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని, ఇద్దరూ సీక్రెట్గా డేటింగ్లో ఉన్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఎయిర్పోర్టులో ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చింది.
అయితే వీటిని మీనాక్షి ఖండించారు. అవన్నీ ఫేక్ అని.. వీటిలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ పుకార్లకు చెక్ పడకపోవడంతో మీనాక్షి టీమ్ క్లారిటీ ఇచ్చింది. సుశాంత్, మీనాక్షిలు మంచి స్నేహితులు మాత్రమేనని వారిద్దరి మధ్య అంతకుమించి ఎలాంటి బంధం లేదని, ఇలాంటి తప్పుడు వార్తలకు ఫుల్స్టాప్ పెట్టాలని కోరింది. అయితే తన కెరీర్ విషయంలో సుశాంత్ ఎంతో ప్రోత్సహించారని, ఆయన వల్లే తెలుగు ఇండస్ట్రీలో తాను అడుగుపెట్టానని సుశాంత్తో ఉన్న బంధాన్ని బయటపెట్టారు మీనాక్షి.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోకు కొద్దిరోజుల క్రితం హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి మీనాక్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. అసలు మీ హర్యానాలో ఎక్కు రెజ్లింగ్ కదా, మరి నువ్వు సినిమాల్లో ఏంటీ అని ప్రశ్నించారు. దీనికి మీనాక్షి స్పందిస్తూ.. నేను స్వతహాగా డెంటిస్ట్ని, దానికి ముందు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మిస్ ఇండియా పోటీలు ముగిసిన తర్వాత సినిమాల్లోకి వచ్చాను. కానీ నేను సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదు.. అంతా డెస్టిని అని చెప్పింది. మరి తెలుగు సినిమాల్లోకి ఎలా వచ్చావు అని బాలయ్య అడగ్గా.. ఇది కూడా డెస్టినీయే. ముంబైలో నేను యాక్టింగ్ వర్క్షాప్లో పాల్గొన్నా. అక్కడ నాకు ఒక మంచి పార్ట్నర్ దొరికాడు.. అప్పుడు అతను ఎవరో తెలియదు. వర్క్షాప్ ముగిసిన తర్వాత నాకు అతను తెలుగు సినిమాలో నటుడు అని, పెద్ద ఫ్యామిలీకి చెందినవాడు అని తెలిసింది. అతనే సుశాంత్. అలా తెలుగులో ఫస్ట్ ఛాన్స్ దొరికింది అని సుశాంత్ గురించి తెలిపింది మీనాక్షి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


















