ప్యాన్ ఇండియా హీరోలా? సౌత్ ఇండియా స్టార్లపై మీరా చోప్రా ట్వీట్.. బాలీవుడ్లో దుమారం
తెలుగులో వాన, బంగారం వంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న మీరా చోప్రా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కు, మీరా చోప్రాకు లాక్ డౌన్ సమయంలో జరిగిన రచ్చ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, మహిళా కమిషన్ వద్దకు ఈ గొడవ వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని రోజుల తరువాత అంతా క్లియర్ అయినట్టే కనిపించింది కానీ ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే విధంగా ఆమె ఒక ట్వీట్ చేసింది. ఈ క్రమంలో మళ్ళీ రచ్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాలు

లాక్ డౌన్ సమయంలో
ప్రియాంక చోప్రా సెకండ్ కజిన్ అయిన మీరా చోప్రా అంబే అరాయురే అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాతి ఏడాదే బంగారం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో సినిమా పెద్దగా ఆడకున్నా ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఎక్కువ తమిళ తెలుగు సినిమాలు చేసిన ఆమె తెలుగులో చివరిగా గ్రీకు వీరుడు సినిమాలో కనిపించింది. ఇక హిందీలో ప్రస్తుతం సినిమాలు చేస్తున్న ఆమె అనుకోకుండా లాక్ డౌన్ సమయంలో ఒక వివాదానికి కారణం అయింది.

ఎన్టీఆర్ ఎవరో తెలీదని
మీరా చోప్రా లాక్ డౌన్ సమయంలో అభిమానులతో ట్విట్టర్లో చాట్ చేసింది. ఈ క్రమంలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అందులో తెలుగు నుంచి ఇష్టమైన హీరోగా మహేష్ బాబు పేరు చెప్పింది. అదే క్రమంలో జూ ఎన్టీఆర్ ఎవరో తెలీదని, తాను ఆయన ఫ్యాన్ను కాదని పేర్కొంది. ఎన్టీఆర్ ఎవరో తెలీదని చెప్పడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ హర్ట్ అయ్యారు.

పెద్ద దుమారాన్నే లేపి
ఇక ఫ్యాన్స్ అందరూ కలిసి ఆమెను టార్గెట్ చేయడం మొదలు పెట్టడమే కాక ఆమెకు చుక్కలు చూపించారు. ఆమెతో పాటు, కుటుంబ సభ్యులను సైతం దూషించారు. రేప్ చేస్తామని బెదిరించారు. అందర్నీ చంపేస్తామని హెచ్చరించారు. వీటిపై మీరా చోప్రా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఈ వివాదం పెద్ద దుమారాన్నే లేపింది.

చాలా గర్వంగా ఉందని
ఇక ఆ విషయం ఎలాగో మరుగున పడింది. ఇక తాజాగా ఆమె మరో వివాదానికి కారణమైంది. ఆమె తాజాగా దక్షిణ భారత నటీనటులు పాన్ ఇండియా గుర్తింపు పొందడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారి ప్రతిభ, వారి వినయం, వారి అభిరుచి నుంచి మనం చాలా నేర్చుకోవాలి'' అంటూ ఆమె ట్వీట్ చేసింది. అలాగే ప్రభాస్, అల్లుఅర్జున్, రామ్చరణ్, యష్ పేర్లను ప్రస్తావించింది. చాలా గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

ప్యాన్ ఇండియా క్రేజ్
అయితే ఈ విషయం మీద ఇప్పుడు రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ప్రభాస్ బాహుబలితో సత్తా చాటితే యష్ కేజీఎఫ్ తో సత్తా చాటాడు. అల్లు అర్జున్ పుష్పతో నార్త్ సహా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు RRR సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే వీళ్లందరి పేర్లు చెప్పి ఎన్టీఆర్ పేరు మిస్ అవడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ వాళ్ళ పేర్లు పెట్టి
మరో పక్క నార్త్ ఫాన్స్ ఏమో అసలు బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోనే లేనట్టు సౌత్ వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు ఇలా నార్త్ వాళ్ళను అవమానిస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుంది అనేది ప్రస్తుతానికి అయితే చెప్పలేం. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











