ఢిల్లీలో సినీ హీరోయిన్ అరెస్ట్.. ఆ కేసులో మోస్ట్ వాంటెడ్గా
సినిమాల కంటే హీరోయిన్లు వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కన్నడ నటి రన్యారావు వ్యవహారం చిత్ర పరిశ్రమలో దుమారం రేగిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల నుంచి భారత్లోకి చట్ట విరుద్ధంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఐ అధికారులకు లొంగిపోయింది రన్యారావు. ఈ కేసులో ఆమెకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. తాజాగా మరో హీరోయిన్ చిక్కుల్లో పడింది. ఈ వివరాల్లోకి వెళితే..
మోడల్గా ఇండస్ట్రీలోకి
ఆ నటి ఎవరో కాదు సినీనటి మీరా మిథున్. తమిళనాడుకు చెందిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు తమిళ సెల్వీ. ఓ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ గణేష్ గురు ఆమెను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగి కొన్ని సినిమాలకు ఆడిషన్స్ తీసుకున్నారు. అప్పటికే ఫ్యాషన్ ప్రపంచంలో మీరా దూసుకెళ్తున్నారు. మిస్ ఫేస్ ఆఫ్ చెన్నై బ్యూటీ కాంటెస్ట్లో విజయం సాధించిన మీరా.. ఆ తర్వాత మిస్ మద్రాస్ 2015 కాంటెస్ట్లో పాల్గొని రన్నరప్గా నిలిచారు. రెగ్యులర్గా సినిమా స్పైస్ చెన్నై ఫ్యాషన్ క్యాలెండర్లో ఆమె ఫోటోలు దర్శనమిచ్చేవి.

రజనీ, విజయ్లపై ఆరోపణలు
ఈ క్రమంలో మిస్ సౌత్ ఇండియా 2016 టైటిల్ గెలిచిన మీరా మిథున్.. ఆ తర్వాత మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా 2016 కాంటెస్ట్లోనూ పాల్గొన్నారు. 2017లో మిస్ తమిళనాడు బ్యూటీ కాంటెస్ట్ నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించారు. 2015లో జోడీ నెంబర్ వన్ షో అనే బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనగా 8వ సీజన్లో ఆమె ఆటిట్యూడ్ కారణంగా న్యాయ నిర్ణేతలు బయటికి పంపేశారు. 2015లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నయ్ అరిందల్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించిన మీరా మిథున్ .. 2020లో సూపర్స్టార్ రజనీకాంత్, విజయ్ దళపతిలు తన పరువుకు భంగం కలిగించారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని నరేంద్రమోడీకి వీరాభిమాని అయిన మీరా మిథున్.. తమిళనాడును నాశనం చేయాలని కోరి ప్రకంపనలు సృష్టించింది.
దళితులపై వ్యాఖ్యలు
నోటి దురుసు కారణంగా వరుస వివాదాలలో నిలిచిన మీరా మిథున్.. మూడేళ్ల కిందట దళితుల గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమనడంతో పలు చోట్ల ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. దీంతో 2022లో మీరా మిథున్తో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే కొద్దిరోజులకే వారిద్దరూ బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఈ కేసు విచారణకు సహకరించకపోవడంతో కోర్ట్ గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేకాదు.. నాటి నుంచి వారిద్దరూ పరారీలోనే ఉండటంతో పోలీసలు గాలిస్తున్నారు.
తక్షణం అరెస్ట్ చేయండి
తాజాగా మీరా మిథున్ వ్యవహారంపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెను తక్షణం అరెస్ట్ చేసి కోర్టు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. తొలుత చెన్నైకి దూరంగా ఎక్కడో ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న మీరా మిథున్ను కాపాడాలని ఆమె తల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయిచింది. ఈ పిటిషన్ను విచారించిన కోర్ట్.. మీరాను రక్షించాలని పోలీసులను ఆదేశించింది. కోర్ట్ ఆదేశాల మేరకు రంగలోకి దిగిన పోలీసులు.. మీరాను అరెస్ట్ చేసి ఈ నెల 11న చెన్నై కోర్టులో హాజరు పరచాలని సూచించింది. దీంతో మీరాను ఢిల్లీలోని షెల్టర్ హోమ్కు తరలించారు. ప్రస్తుతం మీరా మిథున్ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన కథనాలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











