ఆ హీరోయిన్ కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరువై ఏళ్లు దాటినా ఏ మాత్రం తగ్గకుండా యువ హీరోలకు సవాల్ విసురుతున్నారు. త్వరలో తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా 'కింగ్100' తో రాబోతున్నారు. సినిమాపై రోజురోజుకూ ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఆ హీరోయిన్ కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చంటూ నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మరాఠీ నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). మోడలింగ్ రంగం నుండి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రవితేజ (RaviTeja) హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' సినమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత విజయ్ దేవరకొండ సరసన చేసిన 'కింగ్ డమ్' (Kingdom) సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయింది. ఈ నటన, గ్లామర్ మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చిపెట్టాయి. ఇటీవల రామ్ పోతినేనితో కలిసి నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' కూడా నటించి మెప్పించింది. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన 'లెనిన్' సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై మూవీ మేకర్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ, "ఈ సినిమాలో భారతి పాత్రే అసలైన హార్ట్బీట్. భాగ్యశ్రీ బోర్సే ఆ పాత్రను అద్భుతంగా పోషించింది. ఆమె కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చు అనిపించేంతగా నటించింది. ప్రేక్షకులు కూడా ఆ పాత్రతో తప్పకుండా కనెక్ట్ అవుతారు" అంటూ హీరోయిన్పై ప్రశంసలు కురిపించారు.
అలాగే చిత్రంలో నటించిన శివాజీ, బ్రహ్మాజీ, సునీల్లతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శివాజీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడని, బ్రహ్మాజీతో 'శివ' సినిమా రోజుల నుంచే స్నేహం కొనసాగుతోందని చెప్పారు. "ఇన్ని సంవత్సరాలు గడిచినా బ్రహ్మాజీ మాత్రం ఇప్పటికీ జెన్-జీ హీరోలా కనిపిస్తాడు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సునీల్తో కలిసి 'మన్మథుడు', 'మాస్' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన జ్ఞాపకాలను కూడా పంచుకున్నారు.
తనయుడు అఖిల్ నటన గురించి మాట్లాడిన నాగార్జున పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. "ఇప్పటివరకు అర్బన్ బ్యాక్డ్రాప్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా కనిపించిన అఖిల్... ఈ సీమ మట్టి కథకు ఎలా సరిపోతాడో మొదట నాకు కూడా సందేహమే. కానీ సినిమా చూసిన తర్వాత ఆ అనుమానాలన్నీ పోయాయి. తెరపై అఖిల్ కనిపించడు... కేవలం 'లెనిన్' పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ పాత్రలో అతడు పూర్తిగా జీవించాడు. స్నేహం, ప్రేమ, పగ... ప్రతి భావోద్వేగాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. సినిమా ముగిసినా 'లెనిన్' పాత్ర ప్రేక్షకుల మనసుల్లో మిగిలిపోతుంది" అని అన్నారు.
చివరగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జూలై 10న విడుదల కానున్న 'లెనిన్' చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన నాగార్జున, "ఈసారి మనవాడు గట్టిగా కొడుతున్నాడు" అంటూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.


Click it and Unblock the Notifications




