భర్తతో కలిపి మాజీ హీరోయిన్ అరెస్ట్.. దేశద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్!
తెలుగువారందరికీ సుపరిచితమై కొన్నాళ్ళ పాటు హీరోయిన్ గా అలరించింది నవనీత్ రాణా. అయితే తరువాతి కాలంలో రాజకీయ నాయకురాలిగా మారిన నవనీత్ కౌర్ ను ఆమె భర్తను అరెస్ట్ చేశారు. అసలు ఏమైంది? ఆమెను ఆమె భర్తను ఎందుకు అరెస్ట్ చేశారు? అనే వివరాల్లోకి వెళితే

వరుస సినిమాలు
నార్త్ లో పుట్టి పెరిగిన నవనీత్ కౌర్ దర్శన్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత శీను వాసంతి లక్ష్మి అనే ప్రయోగాత్మక సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు దక్కాయి. సుమారు ఆరేళ్ల పాటు ఆమె తెలుగులో వరుస సినిమాలు చేసింది.

రవి రానాను ప్రేమించి
అయితే ఆమెకు తెలుగులో క్రేజ్ రావడంతో తమిళ, మలయాళ భాషల్లో కూడా అవకాశాలు దక్కాయి. ఇక ఆ తరువాత ఆమె జగపతి, రూమ్మేట్స్, మహారధి, టెర్రర్, జాబిలమ్మ, ఫ్లాష్ న్యూస్ లాంటి సినిమాల్లో కనిపించింది. చాలా కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కలిసి రాని ఆమెకు రాజమౌళి యమదొంగ సినిమాలో రంభగా పాటలో కనిపించే అవకాశం ఇచ్చారు. అయినా ఆ సినిమాలు ఏవీ కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరం అయి రాజకీయ నాయకుడైన రవి రానాను ప్రేమించి పెళ్ళాడింది.

అమరావతి ఎంపీగా
భర్త ప్రోత్సాహంతో ఆమె మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నిజానికి 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించినా మొదటి సారి ప్రయత్నించినప్పుడు విజయం సాధించలేదు. అయితే కొన్నాళ్లపాటు నియోజకవర్గంలోనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని తీర్చిన నేపథ్యంలో ఆమె 2019 ఎన్నికల్లో గెలుపు సాధించారు. ఆమె భర్త కూడా ప్రస్తుతం అమరావతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఏప్రిల్ 29న
ముంబైలో హనుమాన్ చాలీసా పారాయణం విషయంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఎంపీ నవనీత్ రాణా మరియు ఆమె భర్త రవి రాణాను ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని అనడంతో వారిని అరెస్ట్ చేసి ఆదివారం బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే ఇద్దరినీ మే 6 వరకు జైలుకు పంపాలని కోర్టు ఆదేశించింది. బెయిల్పై ఏప్రిల్ 29న విచారణ ఉంటుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరత్ తెలిపారు.

14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఎంపీ నవనీత్ రాణా, ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణాను బాంద్రా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ముంబై పోలీసులు అతడికి పోలీసు కస్టడీని కోరగా, కోర్టు తిరస్కరించింది. రాణా దంపతులపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద కేసు నమోదు చేశారు. దేశద్రోహం కింద ఈ కేసు నమోదు చేశారు. ఇక దీనికంటే ముందు నవనీత్పై ఐపిసి సెక్షన్ 353 కింద మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని వారి మీద ఆరోపణలు వచ్చాయి. తమ ప్రకటనల ద్వారా మతం, కులాల ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వారి మీద కేసులు నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications











