Nayanathara: భర్త కోసం నయనతార.. రూల్స్ బ్రేక్ చేసి అలా సర్ప్రైజ్
భారతీయ సినిమా పరిశ్రమలో సాధారణ హీరోయిన్ నుంచి ఇండియాలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన వారిలో నయనతార ఒకరు. ఆమె గ్లామర్ హీరోయిన్గానే కాకుండా లేడీ సూపర్ స్టార్ స్థాయిని ఆమె సొంతం చేసుకొన్నారు. తన ఇమేజ్, తన అభిమానులు ఆశించే స్థాయిలో పాత్రలను ఎంచుకొని ఆమె తన కెరీర్ను కొనసాగిస్తున్నారు. అయితే సినిమాలు చేయడం వరకే ఆమె డ్యూటీగా పెట్టుకొంటారు.ఆ సినిమా ప్రమోషన్స్కు దూరంగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు, విమర్శలు వ్యక్తమవుతుంటాయి. ఇటీవల కాలంలో నయనతార అలాంటి అపవాదును పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తాజాగా నయనతార గురించి వైరల్ అయిన వార్త వివరాల్లోకి వెళితే..
నయనతార తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గానే కాకుండా సౌత్లో అత్యధికంగా పారితోషికం అందుకొనే తారల్లో ఒకరిగా నిలిచారు. అయితే హీరో ఏంత పెద్ద వారైనా, తాను నటించే సినిమాను ఎంత పెద్ద సంస్థ నిర్మించినా గానీ.. ఆ సినిమా ప్రమోషన్స్కు రానని ముందే అగ్రిమెంట్ చేయించుకొంటారు అనే విమర్శ ఆమెపై ఉంది. అందుకు తగినట్గుగానే చాలా మంది నిర్మాతలు, హీరోలు ఈ విషయాన్ని పలు సందర్భాల్లో బహిరంగ వేదికలపైనే పంచుకొన్నారు. పలుమార్లు చాలా మంది నిర్మాతలు రిక్వెస్ట్ చేసినా ప్రచార కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం తెలిసిందే.

అయితే ఇటీవల కాలంలో నయనతార ఈ విషయంలో కొంత తన అలవాటును మార్చుకొన్నట్టు కనిపిస్తున్నది. ఆమె ఇటీవల నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్లో కూడా పాల్గొని అందర్నీ సర్ప్రైజ్ చేశారు. చిరంజీవి, అనిల్ రావిపూడితో కలిసి ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాలు పంచుకొని సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో తన పాత్రను నిర్వర్తించారు.
అయితే తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి, ఎస్జే సూర్య నటించిన సినిమాకు నయనతార నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా కోసం, తన భర్త చిత్రం కోసం మరోసారి రూల్స్ బ్రేక్ చేశారు అనే వార్త సోషల్ మీడియాలోను అలాగే మీడియాలో హైలెట్గా మారింది. చెన్నైలో జరిగిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ఈవెంట్కు నయనతార వచ్చారు. తన భర్త విఘ్నేష్ను ప్రేమతో కౌగిలించుకొని ఆల్ ది బెస్ట్ చెప్పడం ట్రెండింగ్గా మారింది. వారిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ అందర్నీ ఆకట్టుకొన్నది.
ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్లో పాల్గొన్నప్పటికీ.. నయనతార మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరు కాలేదు. చాలా రోజుల తర్వాత ఆమె LIK ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. తన సొంత సినిమా కావడంతో ఆమె నిర్మాతగా హాజరయ్యారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ముందు కూడా ఆమె తాను నటించే సినిమాల ఈవెంట్లకు హాజరవుతారా? గతంలో పెట్టుకొన్న రూల్స్ బ్రేక్ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించి టాక్సిక్ సినిమా త్వరలోనే రిలీజ్ కానున్నది. ఇక జవాన్ సినిమా తర్వాత మరోసారి ఆమె బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నది. వంశీ పైడిపెల్లి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నయనతార నటించేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుంది అని చిత్ర యూనిట్ తెలిపారు.


Click it and Unblock the Notifications











