చిరంజీవి అయితే ఏంటి అన్నట్లుగా నయనతార! అలాంటివి కుదరవని చెప్పేసిందట
Recommended Video
సౌత్ ఇండియన్ సినిమాల్లో వెండితెర క్వీన్గా కొనసాగుతోంది నయన తార. కొన్నేళ్లుగా సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ పలు సినిమాల్లో నటించడమే గాక, దక్షిణ భారత అన్ని భాషల్లోని అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, పారితోషికం పరంగా కూడా ఈ అమ్మడిదే ప్రథమ స్థానం. ఇవన్నీ ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం నయనతార ఎప్పుడూ దూరంగా ఉండటం గమనించవచ్చు. అదే సినిమా ప్రమోషన్. తాజాగా చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విషయంలోనూ నయన్ తీరు మారడం లేదని తెలుస్తోంది.

క్రమశిక్షణతో సినిమా.. కానీ ఆ విషయంలో
సినిమా అంతా క్రమశిక్షణతో పూర్తి చేస్తుంది కానీ చివరకు ప్రమోషన్స్ దగ్గర మాత్రం నయనతార జాడ కనిపించదు. గతంలో చాలా సినిమాల విషయంలో ఇలాగే ప్రవర్తించిన నయన్.. మెగాస్టార్ సినిమా సైరాకు అలా డుమ్మా కొట్టదేమో అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ షాకిచ్చింది ఈ వెండితెర రాణి.

అందరూ ఉన్నారు.. నయన్ జాడ లేదు
ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు సుధీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, తమన్నా, రామ్ చరణ్ ఇలా అందరూ పాల్గొన్నప్పటికీ నయనతార జాడే లేదు. సైరాలో నయన్ మేజర్ రోల్ పోషించి కూడా టీజర్ లాంచ్కి రాలేదంటే ఇక నయన్ మిగితా ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ పాల్గొనదని ఫిక్స్ అయ్యారంతా.

ఇంతలో గుప్పుమన్న వార్తలు
ఈ లోగానే నయనతార విషయమై నెట్టింట వార్తలు గుప్పుమంటున్నాయి. తాను సైరా ప్రమోషన్స్లో పాల్గొనేదే లేదని ఖరాకండీగా నిర్మాత రామ్ చరణ్తో నయన్ చెప్పినట్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి. చిరంజీవి సినిమా అయితే ఏంటి అన్నట్లుగా నయనతార వ్యవహారం ఉందని అంటున్నారు. దీనిపై సరైన క్లారిటీ లేనప్పటికీ నయనతార గతంలోనూ పలు సినిమాలకు ప్రమోషన్స్ చేయలేదు కాబట్టి సైరా విషయంలోనూ ఇది నిజమే అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు.

సైరా నరసింహా రెడ్డి.. చిరంజీవి భార్య
సైరా నరసింహా రెడ్డి మూవీని 1857 బ్రిటిష్ కాలం నేపథ్యంలో తెరకెక్కడంతో అప్పటి పరిస్థితులకు అద్దంపట్టేలా భారీ సెట్స్ వేసి రూపొందించారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్ర పోషించింది నయనతార.

వివిధ భాషా చిత్రాల స్టార్ హీరోలు
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథాగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో వివిధ భాషా చిత్రాల స్టార్ హీరోలు భాగమయ్యారు. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న 'సైరా నరసింహా రెడ్డి' మూవీ అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











