పెద్ది వివాదంపై నిత్యా మీనన్ బాంబ్.. అలా చెప్పే ధైర్యం ఉండాలంటూ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెద్ది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా, ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 233 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చుట్టూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వివాదంపై తాజా స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ కూడా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
పెద్ది సినిమాలో హీరోయిన్ పాత్రపై ట్రోలింగ్ జరుగుతోంది. జాన్వీ కపూర్ ను మరింత గ్లామరస్గా చూపించారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు దర్శకులను ప్రశ్నిస్తుండగా, మరికొందరు జాన్వీ కపూర్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే నటీమణులు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి సహా పలువురు హీరోయిన్లు స్పందించి, హీరోయిన్లను విమర్శించడం కంటే దర్శకులను ప్రశ్నించాలని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అచ్చియమ్మ పాత్రను పరిచయం చేసిన విధానం, కొన్ని సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్, హీరోయిన్ను చూపించిన తీరు ప్రేక్షకుల విమర్శలకు కారణమయ్యాయి. కథలో పాత్రకు ఉన్న ప్రాధాన్యత కంటే ఆమె గ్లామర్ను ఎక్కువగా హైలైట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళలను కేవలం ఆకర్షణీయ వస్తువులా చూపించే పాత ధోరణిని ఇంకా కొనసాగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
జాన్వీ పాత్రపై వచ్చిన విమర్శలు తీవ్రరూపం దాల్చడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా స్పందించారు. వివాదాస్పదంగా భావిస్తున్న కొన్ని సన్నివేశాలను తొలగిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తున్నామని, కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించిన సన్నివేశాలను థియేట్రికల్ వెర్షన్ నుంచి తొలగిస్తామని ఆయన ప్రకటించారు. మహిళా ప్రేక్షకులకు క్షమాపణలు కూడా తెలిపారు. సాధారణంగా భారీ విజయాన్ని అందుకుంటున్న సినిమా విషయంలో దర్శకుడు ఇంత త్వరగా స్పందించడం అరుదైన విషయమే. అయినప్పటికీ వివాదం పూర్తిగా ముగియలేదు.
ఈ అంశంపై తాజాగా నిత్యా మీనన్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళలను కేవలం గ్లామర్ కోణంలో చూపించడం ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమ సమస్య కాదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాణిజ్య సినిమాల్లో ఇదే ధోరణి కనిపిస్తోందని చెప్పారు. ప్రేక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో మహిళా పాత్రలను అవసరానికి మించి గ్లామరైజ్ చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం దర్శకులను మాత్రమే తప్పుబట్టడం సరైంది కాదని, నటీమణులు కూడా తమ పాత్రల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఒక పాత్ర తమ వ్యక్తిగత విలువలకు విరుద్ధంగా ఉందని భావిస్తే దానిని తిరస్కరించే ధైర్యం ఉండాలని అన్నారు. తాను గతంలో కొన్ని పెద్ద ప్రాజెక్టులను కూడా ఇలాంటి కారణాల వల్ల వదులుకున్నానని చెప్పడం విశేషం. నిత్యా మీనన్ అభిప్రాయం ప్రకారం, కెరీర్ ప్రారంభం నుంచే నటీనటులు తమ హద్దులను నిర్ణయించుకోవాలి. ఒకవేళ చాలా కాలం పాటు గ్లామర్ ఆధారిత పాత్రలు చేస్తూ వచ్చి, ఒక్కసారిగా అలాంటి పాత్రలను వ్యతిరేకిస్తే ప్రేక్షకులు కూడా ఆ మార్పును పూర్తిగా నమ్మకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ వివాదం ఎంత పెరుగుతున్నా 'పెద్ది' బాక్సాఫీస్ జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సినిమా ఇప్పటికే వందల కోట్ల వసూళ్లతో రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఒకవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే, మరోవైపు మహిళా పాత్రల చిత్రీకరణపై సినీ పరిశ్రమలో అవసరమైన చర్చకు కారణమవుతోంది. మొత్తంగా పెద్ది వివాదం కేవలం ఒక సినిమా లేదా ఒక పాత్రకు పరిమితం కాకుండా, వాణిజ్య సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉండాలి? గ్లామర్కు, పాత్ర గౌరవానికి మధ్య గీత ఎక్కడ గీయాలి? అనే పెద్ద చర్చకు దారితీసింది.


Click it and Unblock the Notifications





