సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్కి అంత పెద్ద కష్టమొచ్చిందా?
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్స్ కామన్. కొంతమంది హీరోయిన్లు ఒక్క సినిమాతో స్టార్డమ్ను అందుకుంటే, మరికొందరు ప్రతిభ, అందం, నటన ఉన్నప్పటికీ అనుకున్న స్థాయికి చేరుకోలేకపోతారు. అలాంటి వారిలో హీరోయిన్ నివేదా పేతురాజ్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని పరిణామాలు ఆమెను సినిమాలకు దూరం చేశాయి. తాజాగా ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ ఏమన్నారంటే?
శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన 'మెంటల్ మదిలో'సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్, తొలి చిత్రంతోనే తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, దాస్ కా ధమ్కీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నటనతో పాటు గ్లామర్ పరంగానూ ఆకట్టుకున్న నివేదా, ఒక దశలో టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారుతుందని అందరూ భావించారు.

అయితే వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని పరిణామాలు ఆమె కెరీర్పై ప్రభావం చూపాయి. సోషల్ మీడియాలో తన ప్రేమను బహిరంగంగా ప్రకటించిన నివేదా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని కూడా వెల్లడించింది. కానీ అనూహ్యంగా ఆ బంధం ముగిసిపోయింది. అనంతరం సోషల్ మీడియా ఖాతాల నుంచి ప్రియుడితో ఉన్న ఫోటోలను తొలగించడంతో బ్రేకప్ వార్తలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఆమె సినిమాలకు కూడా దూరమైంది.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్ గీతం' సినిమా గోల్డెన్ బ్లాక్బస్టర్ ఈవెంట్లో పాల్గొన్న నివేదా పేతురాజ్ తన మనసులోని మాటను బయటపెట్టింది. '2023లో నేను సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నా. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ఆ సమయంలో నేను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవ్వాలని అనుకున్నా. ఒకవేళ నాగ్ అశ్విన్ నాకు ఈ అవకాశం ఇవ్వకపోయి ఉంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని'అంటూ ఎమోషనల్ అయ్యారు.
నివేదా తన రీఎంట్రీకి ప్రధాన కారణం నిర్మాత నాగ్ అశ్విన్ అని స్పష్టం చేసింది. 'నాకు మళ్లీ ప్రాణం పోసింది నాగ్ అశ్విన్. ఈ సినిమా ద్వారా నేను తిరిగి ఇండస్ట్రీలో నిలబడే అవకాశం వచ్చింది. నేను కోరుకున్న డిఫరెంట్ లైఫ్ వైపు వెళ్లిపోవాలనుకున్నా. కానీ ఇప్పుడు గొప్ప సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాను'అని ఆమె పేర్కొంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జీవితంలో ఎదురైన కష్టాల వల్ల సినిమాలనే వదిలేయాలని నిర్ణయించుకున్నానని చెప్పడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'సింగ్ గీతం' చిత్రాన్ని వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు నిర్మించాయి. ఇందులో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రల్లో నటించగా, విజయ్ దేవరకొండ ప్రత్యేక పాత్రలో కనిపించారు. నివేదా పేతురాజ్ కూడా స్పెషల్ రోల్లో మెప్పించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జూన్ 12న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ విజయంతో నివేదా పేతురాజ్కు కూడా మంచి కమ్బ్యాక్ దక్కిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమాలకు దూరమైన తర్వాత ఇప్పుడు నివేదా మళ్లీ వరుస అవకాశాలను అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న 'మెగా 158' చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం'సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్న హీరోయిన్, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో నివేదా ఎంత పెద్ద విజయాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications





