‘విరాట పర్వం’లోకి టాలెంటెడ్ హీరోయిన్: వాళ్లిద్దరినీ కలిపేందుకు ప్రయత్నం
టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'విరాట పర్వం'. రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్తో వస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్నాడు. 1990వ దశకంలో జరిగిన నక్సలైట్ ఉద్యమం నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో స్వచ్చమైన ప్రేమ కథను చూపించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో రానా పోలీస్ ఆఫీసర్ గానూ, సాయి పల్లవి నక్సలైట్ గానూ నటిస్తున్నారని అంటున్నారు.
నక్సలైట్లను ఏరి వేసే క్రమంలో అడవుల్లోకి వెళ్లిన పోలీస్ ఆఫీసర్ రానా... ఉద్యమ నాయకురాలైన సాయి పల్లవిని చూసి ఇష్టపడతాడట. ఆ తర్వాత వీళ్ల బంధం ఎలా సాగింది? వీళ్లిద్దరికీ ఎటువంటి కష్టాలు ఎదురయ్యాయి? చివరికి వీళ్లిద్దరూ కలిశారా లేదా? అనే అంశాలతో 'విరాట పర్వం' రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరో హీరోయిన్లను కలిపడానికి ప్రయత్నించే అత్యంత కీలకమైన పాత్ర కోసం మరో టాలెంటెడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ను తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న హైదరాబాద్ షెడ్యూల్లో ఈమె పాల్గొంటుందని తెలుస్తోంది.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో ప్రారంభం అయింది. రానా అందుబాటులో లేకపోవడంతో, అతడు లేని సీన్స్ చాలా వరకు షూట్ చేశారు. ఇక, ఈ మధ్య మొదలైన షెడ్యూల్లో అతడు పాల్గొంటున్నాడు. ఇందులో హీరోపైన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీని చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2021లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











