వదిన అని పిలవొద్దు... జానీ మాస్టర్కు రేణు దేశాయ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఆమె స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే రేణు దేశాయ్ని ఇప్పటికీ తమ మనిషిగానే భావిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఆమెను వదిన అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే కొన్నిసార్లు వీరి ఓవరాక్షన్ కారణంగా రేణు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రేణు దేశాయ్ రెండో పెళ్లిపై గాసిప్స్
పవన్ కళ్యాణ్తో విడాకుల తర్వాత సినీ జీవితానికి వీడ్కోలు పలికిన రేణు దేశాయ్.. పిల్లలు అకీరా నందన్, ఆద్యలే లోకంగా బతుకుతున్నారు. ఎన్జీవో సంస్థను స్థాపించి మూగ జీవాల సంరక్షణ కోసం పాటుపడుతున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారని పలుమార్లు ఊహాగానాలు వినిపించినప్పటికీ అవన్నీ గాలివార్తలేనని రేణు దేశాయ్ పలుమార్లు కొట్టిపారేశారు. తొలి నుంచి సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు విలువనిచ్చే రేణూ దేశాయ్.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఇష్టపడతారు.

ఇంకా మగాళ్ల పర్మిషన్ కావాలా?
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే రేణు దేశాయ్ని పవన్ కళ్యాణ్ అభిమానులు... ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. గతంలో ఆమె రెండో పెళ్లి గురించి గాసిప్స్ వైరల్ అయిన సందర్భంలో పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్కు దిగారు. వదిన మేము మిమ్మల్ని ఇంకా పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తున్నామని, మీ జీవితంలో మరొకరిని ఊహించుకోలేమంటూ అప్పట్లో ఓ అభిమాని పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. దీనికి అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు రేణు దేశాయ్. స్త్రీలు.. భర్త లేదా తండ్రి ఆస్తిగా భావించే పితృస్వామిక ధోరణి ఈ 2025లోనూ ఇంకా కొనసాగుతోంది. మహిళలను పశువులుగా, ఫర్నిచర్లా చూసే మైండ్సెట్ని ప్రశ్నించడమే నిజమైన ఫెమినిజం. మహిళలు ఎప్పటికీ వంటగదిలో మాత్రమే ఉండటం, పిల్లలని చూసుకోవడమే వారి పని అని భావించే మగాళ్లు ఇప్పటికీ ఉన్నారు. మహిళలు వారికి నచ్చినట్లుగా జీవించడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని రేణు పేర్కొంది.
రేణు దేశాయ్ కొత్త సినిమా
ఆమె ఎంతగా క్లాస్ పీకుతున్నప్పటికీ కొందరు మాత్రం మారడం లేదు. తాజాగా రేణు దేశాయ్కి ఇదే పరిస్ధితి ఎదురైంది. టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ అనంతరం లాంగ్ గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పదహారు రోజుల పండుగ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో తాను నటిస్తున్నట్లు తెలిపారు. సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఉద్యన్ హీరోయిన్గా నటిస్తుండగా.. సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, కృష్ణుడు, విష్ణు తదితరులు ఇతర పాత్రల్లో పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్పై సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ నిర్మిస్తున్నారు.
జానీ మాస్టర్కు వార్నింగ్
హైదరాబాద్లో ఇటీవల జరిగిన పదహారు రోజుల పండుగ ఓపెనింగ్ కార్యక్రమంలో రేణు దేశాయ్ పాల్గొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా హాజరయ్యారు. రేణు దేశాయ్ని చూడగానే ఆనందంతో వదిన అని పిలిచాడు. ఆ మాట వినగానే రేణు సీరియస్ అయ్యారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి వదిన అని.. అక్క అని పిలువు అన్నారు. దాంతో జానీ మాస్టర్ నాలుక కరచుకుని పొరపాటున వచ్చేసిందని నమస్కారం చేసి పక్కనే ఉన్న అనసూయ భరద్వాజ్ని పలకరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











