పవన్ను టచ్ చేసిన వాళ్లకు ఏమైందో తెలుసా?.. ప్రకాష్ రాజ్కు హేమ స్ట్రాంగ్ వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోనూ పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఈ ప్రకటనపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి కారణమయ్యాయి.
'రండి దొర.. మీరొస్తానంటే మేమొద్దంటామా? కానీ పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్గా వస్తున్నారా?'అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించినవేనని రాజకీయ, సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన నేరుగా పవన్ పేరు ప్రస్తావించకపోయినా, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు జనసేన అధినేతపైనేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ట్వీట్పై సినీ నటి హేమ (Hema)తీవ్రంగా స్పందించారు. రాజకీయ నాయకులను వారి విధానాల ఆధారంగా విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, కానీ వ్యక్తిగతంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో "దొర" అనే పదానికి ఉన్న సామాజిక, రాజకీయ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ, ఆ పదాన్ని ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియోలో హేమ మాట్లాడుతూ, 'పవన్ కళ్యాణ్ను రాజకీయంగా విమర్శించండి. ఆయన పార్టీ నిర్ణయాలను ప్రశ్నించండి. ప్రభుత్వ విధానాలను తప్పుబట్టండి. కానీ వ్యక్తిత్వ హననానికి దిగొద్దు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి కోట్లాది మంది ప్రజలకు తెలుసు'అని అన్నారు. అంతేకాదు, గతంలో పవన్పై వ్యక్తిగత విమర్శలు చేసిన వారు రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో చరిత్ర చూసి తెలుసుకోవాలని ప్రకాష్ రాజ్కు సూచించారు. హేమ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, జనసేన అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు, ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించే వర్గాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఇక హేమ మాత్రమే కాదు, నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh)కూడా ప్రకాష్ రాజ్పై తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రతి అంశంలో జోక్యం చేసుకుని వ్యాఖ్యలు చేయడం అవసరమా అని ప్రశ్నించిన ఆయన, "మీ సంగతి మీరు చూసుకోండి. ప్రపంచాన్ని మార్చే బాధ్యత మీ ఒక్కరిపైనే లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ను ఉద్దేశిస్తూ చేసిన బండ్ల వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.
మొత్తంగా చూస్తే, తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎంట్రీ ప్రకటనతో మొదలైన చర్చ ఇప్పుడు సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధంగా మారింది. ఒకవైపు ప్రకాష్ రాజ్ చేసిన సెటైరికల్ ట్వీట్, మరోవైపు హేమ, బండ్ల గణేష్ లాంటి ప్రముఖుల కౌంటర్లతో ఈ వ్యవహారం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. రానున్న రోజుల్లో ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ లేదా జనసేన వర్గాలు మరింత స్పందిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications




