18 కోట్ల రూపాయల రుణం ఎగవేత? దిమ్మతిరిగేలా వెంకటేష్ హీరోయిన్ కౌంటర్
సోషల్ మీడియా రాకతో నటీనటులపై ట్రోలింగ్తో పాటు ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కొందరు దీనిని చూసిచూడనట్లుగా వదిలేస్తుండగా.. మరికొందరు మాత్రం గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా అలనాటి బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్స్పై గట్టిగా కౌంటరిచ్చారు. ఇదే సమయంలో బాలీవుడ్లో పెయిడ్ మీడియా, పీఆర్పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
1990, 2000 దశకాలలో బాలీవుడ్ను ఏలారు సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. అందంతో పాటు నటనతో ఆమె కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన దిల్ సేతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సోల్జర్, క్యా కెహ్నా, చొరి చొరి చుప్కే చుప్కే, దిల్ చాహతా హై, దిల్ హై తుమ్హారా, అర్మాన్, కల్ హో నా హో, కోయి మిల్గయా, వీర్ జరా సలామ్ నమస్తే, కబీ అల్విదా నా కెహ్నా తదితర హిందీ చిత్రాలలో నటించారు. ప్రేమంటే ఇదేరా చిత్రంతో తెలుగువారిని పలకరించిన ప్రీతి జింటా.. రాజకుమారుడు సినిమాలోనూ నటించారు.

కెరీర్ పీక్స్లో ఉండగానే అమెరికాకు చెందిన జీన్ గుడ్ఇనఫ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లాస్ ఏంజిల్స్లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. సినిమాలతో పాటు వ్యాపారవేత్తగానూ రాణించారు ప్రీతి జింటా. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరించారు. ఐపీఎల్ సమయంలో జట్టును ఎంకరేజ్ చేస్తూ ఆమె గ్రౌండ్లో హల్చల్ చేసేవారు.
సినిమాలే కాదు.. పలు వివాదాల్లోనూ ప్రీతి జింటా పేరు తెరపైకి వచ్చింది. భరత్ షా కేసులో ఆమె వినిపించడం బాలీవుడ్ వర్గాలను షాక్కు గురిచేసింది. అలాగే అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్తో ప్రీతికి సంబంధాలున్నాయని వార్తలు వచ్చాయి. ప్రముఖ వ్యాపారవేత్త నెస్వాడియాతో డేటింగ్ చేసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని పెళ్లి వరకు వెళ్లారు. వీరి బంధం కూడా వివాదాస్పదంగా ముగిసింది. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా నెస్వాడియా తనను వేధింపులకు గురిచేశాడంటూ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్న ప్రీతి జింటా.. అప్పుడప్పుడు ఇండియాకు వస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడంతో ఆమె పంజాబ్ కింగ్స్కు మద్ధతుగా రంగంలోకి దిగారు.
కాగా.. ప్రీతి జింటా 18 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని, దానిని తిరిగి చెల్లించడం లేదంటూ సోషల్ మీడియాలో పలుమార్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీటిని ప్రీతి గట్టిగానే ఖండించారు. తాజాగా మరోసారి 18 కోట్ల రూపాయల లోన్ చుట్టూ కథనాలు రావడంతో ఆమె స్పందించారు. 18 కోట్ల రుణానికి సంబంధించిన కథనాలు పూర్తిగా అవాస్తవం. తెలియనివాళ్లు ఏదో రాస్తే.. మరికొందరు వీటిని కాపీ చేసి వ్యాప్తి చేస్తున్నారు. ఈ వార్త అబ్ధమని ఎన్నోసార్లు చెప్పినా ఇప్పటికీ దానిపైనే ప్రశ్నిస్తున్నారు. తొలి నుంచి పెయిడ్ మీడియా, పీఆర్ వంటి వాటిని కొనడానికి నేను సిద్దంగా లేను. ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడాన్నే నేను ఇష్టపడతాను. చాలామంది సెలబ్రిటీలు ఫేక్ ఫాలోవర్స్, లైకులను కొంటారు. సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలి... దాని వల్ల పాజిటివిటీతో పాటు నెగిటివిటీ కూడా అదే స్థాయిలో వస్తుందని ప్రీతి జింటా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications