కిస్సింగ్ సీన్తో హద్దు మీరిన హీరో.. యంగ్ హీరోయిన్ భర్తను పిలిచి..
సినీ ఇండస్ట్రీలో గ్లామర్, స్టార్డమ్, విజయాల వెనుక ఎన్నో చేదు అనుభవాలు దాగి ఉంటాయని తరచూ నటీనటులు చెబుతుంటారు. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటీమణులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, అసౌకర్యకర పరిస్థితులు, అనుచిత ప్రవర్తనల గురించి అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే సంఘటనలు సంచలనంగా మారుతుంటాయి. తాజాగా ప్రముఖ నటి తనకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఈ ఆ నటి ఎవరు? అసలేం జరిగిందంటే?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రముఖ మరాఠీ నటి ప్రియా బాపట్, ఈ అమ్మడు మరాఠీ చిత్రాలు, టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అయితే ఆమె కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ తనను వెంటాడుతుందని, ఆ చేదు అనుభవం తనని ఇంకా వెంటాడుతుందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముఖ్యంగా తన మొదటి హిందీ సినిమా షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఆమె బహిర్గతం చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

కిస్సింగ్ సీన్పైనే
ప్రియా చెప్పిన వివరాల ప్రకారం.. ఆ సినిమాలో కేవలం ఒక కిస్సింగ్ సీన్ మాత్రమే ఉండేది. అయితే స్క్రిప్ట్ చదివినప్పటి నుంచే ఆ సన్నివేశం కథకు ఎంతవరకు అవసరమో తనకు సందేహంగా అనిపించిందట. అందుకే దర్శకుడిని పదేపదే ప్రశ్నించినట్లు తెలిపింది. "నాకు కిస్సింగ్ సీన్ చేయడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అది కథలో సహజంగా కనిపించాలే గానీ కేవలం ఆకర్షణ కోసం ఉండకూడదు. అందుకే ఆ సన్నివేశం ఎందుకు అవసరమో దర్శకుడిని పలుమార్లు అడిగాను. అయితే ఆయన అది కథకు చాలా ముఖ్యమని చెప్పడంతో చివరకు అంగీకరించాను" అని ప్రియా వివరించింది.
సీన్ పేరుతో హద్దులు దాటిన సహనటుడు?
అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారిపోయిందని ఆమె ఆరోపించింది. తాను ఒక కిస్కు మాత్రమే అంగీకరించినప్పటికీ, సహనటుడు సన్నివేశాన్ని ఇంప్రొవైజ్ చేస్తూ పదేపదే ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడని తెలిపింది. "ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన నటిని. ఆ సమయంలో ఎలా స్పందించాలో, ఎవరికి చెప్పాలో కూడా తెలియలేదు. అందుకే గట్టిగా నిలబడలేకపోయాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
షూటింగ్ తర్వాత కూడా వెంటాడిన మెసేజ్లు
ప్రియాను ఎక్కువగా కలవరపెట్టింది షూటింగ్ తర్వాత జరిగిన వ్యవహారమట. షూటింగ్ కోసం ఒకే హోటల్లో బస చేస్తున్న సమయంలో ఆ నటుడు తనకు వరుసగా మెసేజ్లు పంపేవాడని ఆమె వెల్లడించింది. "నేను స్విమ్మింగ్ నేర్పిస్తాను, డిన్నర్కు వెళ్దాం, బ్రేక్ఫాస్ట్కు కలుద్దాం" అంటూ తరచూ సందేశాలు పంపేవాడని పేర్కొంది. మొదట్లో వాటిని పట్టించుకోకుండా ఉన్నప్పటికీ, తర్వాత ఆ వ్యవహారం తనకు అసౌకర్యంగా మారిందని చెప్పింది.
పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో చివరికి తన భర్త, ప్రముఖ నటుడు ఉమేష్ కామత్ను సంప్రదించినట్లు ప్రియా వెల్లడించింది. "మేమిద్దరం ఒకరి షూటింగ్లకు మరొకరు వెళ్లకూడదనే నియమం పెట్టుకున్నాం. కానీ ఆ సమయంలో నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను. ప్రతిరోజూ రాత్రి ఉమేష్కు ఫోన్ చేసేదాన్ని. చివరకు ఆయన ముంబై నుంచి భోపాల్కు వచ్చి మూడు రోజుల పాటు నా వెంట ఉన్నారు" అని తెలిపింది. ఉమేష్ అక్కడ ఉండటంతో ఆ నటుడికి తాను ఒంటరిగా లేనన్న విషయం అర్థమైందని, ఆ తర్వాత పరిస్థితి మారిందని ఆమె చెప్పింది. ప్రియా బాపట్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ప్రియా తన వ్యాఖ్యల్లో ఎక్కడా ఆ సహనటుడి పేరును వెల్లడించలేదు. అందువల్ల సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలైనప్పటికీ, ఎవరినీ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయకూడదని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రియా బాపట్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఏళ్ల తర్వాత ఆమె బయటపెట్టిన ఈ అనుభవం, ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే సవాళ్లపై మరోసారి దృష్టి సారించేలా చేసింది.


Click it and Unblock the Notifications





