‘మహేష్ బాబు అంటే ఇష్టం.. ఆయనతో అలాంటి సినిమాలో నటించాలని’
టాలీవుడ్ అందాల నటి రాశి ఖన్నా (Raashii Khanna) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్లో చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించిన ఆమె, తరువాత టాలీవుడ్లో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా ఊహాలు గుసగుసలాడే (Oohalu Gusagusalade) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఆమె వరుసగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది.తాజాగా మెగా పవర్ ప్యాక్డ్ కాంబో హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. నెక్ట్స్ ఆ స్టార్ హీరోతో నటించాలని, తన కోరికను బయటపెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆమె కోరిక ఏంటీ?
రాశి ఖన్నా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) ప్రధాన హీరోయిన్గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో రాశీ ఖన్నా కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ రాశీఖన్నా బిజీబిజీగా పాల్గొంటుంది.

ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్తో కలిసి పని చేయడం తనకు చాలా కాలంగా ఉన్న కల అని ఆమె వెల్లడించారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథను మొదట వినలేదని, కానీ పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్పై ఉన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్కు వెంటనే అంగీకరించానని చెప్పారు. షూటింగ్ సెట్స్లో చేరిన తర్వాతే కథను పూర్తిగా తెలుసుకున్నానని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్తో కలిసి నటించడం తన కెరీర్ ప్రారంభం నుంచే కలగా భావించానని, ఆ కల ఈ సినిమాతో నెరవేరడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనలో ఒక ప్రత్యేకమైన ఆరా ఉంటుందని, మొదటిసారి ఆయనతో కలిసి నటించేటప్పుడు చాలా టెన్షన్గా అనిపించిందని తెలిపారు. మొదటిసారి ఆయనను ఎదురుగా చూసినప్పుడు కొద్దిసేపు భయపడిపోయానని, చెప్పాల్సిన డైలాగ్లు కూడా మర్చిపోయానని నవ్వుతూ గుర్తుచేశారు. అయితే షూటింగ్ కొన్ని రోజులు కొనసాగిన తర్వాత ఆ భయం పూర్తిగా పోయిందని చెప్పారు. తరువాత పవన్ కళ్యాణ్తో ఎంతో ఫ్రీగా నటించగలిగానని తెలిపారు. సెట్స్లో ఆయన ఉంటే ఒక ప్రత్యేకమైన పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుందని, అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పారు.
ఇదే సమయంలో రాశీ ఖన్నా మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేసే కల నెరవేరిందని, ఇక ముందు మరో టాలీవుడ్ సూపర్ స్టార్తో కలిసి నటించాలని ఉందని చెప్పారు. ఆ హీరో మరెవరో కాదు మహేశ్ బాబు (Mahesh Babu). మహేష్ బాబుతో ఒక మంచి సినిమాలో నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నానని ఆమె తెలిపారు. వారణాసి అనే తన తదుపరి సినిమా తర్వాత మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలని ఆమె ఆసక్తిగా చెప్పారు.
ఇక తనకు ఎలాంటి సినిమా చేయాలని ఉందో కూడా రాశీ ఖన్నా వివరించారు. హాలీవుడ్ చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ ( Mr. & Mrs.Smith) తరహాలో యాక్షన్, కామెడీ మేళవించిన సినిమాల్లో నటించాలని ఉందని చెప్పారు. అలాంటి సినిమాలో యాక్షన్ పార్ట్తో పాటు కామెడీ కూడా ఉండటం చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. అదే కథలో మహేష్ బాబు హీరోగా ఉంటే ఇంకా బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇలా రాశీ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబుతో కలిసి నటించాలని ఉందన్న ఆమె కోరిక అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.


Click it and Unblock the Notifications











