వరలక్ష్మిని చాలా టార్చర్ చేశారు.. శరత్ కుమార్పై నటి రాధిక షాకింగ్ కామెంట్స్..
వరలక్ష్మి (Varalaxmi SarathKumar) ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన తాజా సినిమా సరస్వతి (Saraswathi). ఈ సినిమాను వరలక్ష్మి తన సోదరి పూజతో కలిసి నిర్మించారు. ఈ మూవీలో ప్రియమణి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. అలాగే రాధిక, రావు రమేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, సప్తగిరి కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని తమన్ అందించగా, సినిమాటోగ్రఫీని ఎమ్. ఎడ్విన్ సకాయ్, ఎడిటింగ్ను వెంకట్ రాజెన్ నిర్వహిస్తున్నారు. 'దోశ డైరీస్' బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు హైదరాబాద్లో సరస్వతి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Saraswathi Pre Release Event)లో నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందంతోపాటు రాధిక, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarathkumar) వరలక్ష్మి సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.వరలక్ష్మి హీరోయిన్ అవుతానని చెప్పినప్పుడు ఆమె తండ్రి, ప్రముఖ నటుడు ఆర్ శరత్ కుమార్ (R.Sarathkumar) మొదట్లో అస్సలు అంగీకరించలేదని రాధిక వెల్లడించారు.

'నువ్వు ఎలా నటిస్తావు? సినిమా ఇండస్ట్రీ చాలా కష్టం.నేను ఒప్పుకోను' అని శరత్కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. అంతేకాకుండా.. కొంతమంది నిర్మాతలకు నేరుగా ఫోన్ చేసి 'నా కూతురిని సినిమాలో పెట్టొద్దు' అని కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. ఒకరోజు వరలక్ష్మి, ఆమె తల్లి ఛాయ కలిసి శరత్కుమార్ను ఒప్పించేందుకు రాధికను ఆశ్రయించారని తెలిపారు. 'నేను నిర్ణయం తీసుకునే స్థితిలో లేను. కానీ మీకు సపోర్ట్ చేస్తాను' అని వారికి చెప్పానని రాధిక వెల్లడించారు.
అదే సమయంలో శరత్కుమార్ ఓ పాట షూటింగ్లో హీరోయిన్ నమితతో కలిసి నటిస్తుండగా, అక్కడి కాస్ట్యూమ్స్ చూసి వరలక్ష్మి షాక్ అయ్యారని చెప్పారు. సినిమా ప్రపంచం ఎంత భిన్నంగా ఉంటుందో అప్పుడు ఆమెకు అర్థమైందన్నారు. అయినా వరలక్ష్మి తన నిర్ణయంపై నిలబడింది. తండ్రిని ఒప్పించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె తొలి సినిమా రోజునే 'ఇది ఒకరోజు పెద్ద నటి అవుతుంది. నువ్వు గర్వపడే రోజు వస్తుంది' అని శరత్కుమార్కు చెప్పానని రాధిక అన్నారు. ఆ మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని పేర్కొన్నారు.
వరలక్ష్మికి తాను ఇచ్చిన ముఖ్యమైన సలహా గురించి కూడా రాధిక చెప్పారు. 'టాలీవుడ్పై శ్రద్ధ పెట్టు. తెలుగులో సినిమాలు చెయ్. అక్కడ గౌరవం ఎక్కువ. తెలుగు ప్రేక్షకుల అమితమైన ప్రేమ చూపిస్తారు' అని సూచించానని వెల్లడించారు. తాను కూడా తెలుగులో ఎన్నో సినిమాలు చేసి మంచి గౌరవం పొందానని గుర్తుచేశారు. నిజంగానే తెలుగు పరిశ్రమలో నటులకు ప్రత్యేక గౌరవం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మార్చి 6న విడుదల కానున్న 'సరస్వతి' వరలక్ష్మి కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందా? ఎలాంటి విజయం సాధిస్తుందో వేచిచూడాలి.
ఇక ఈ ఈవెంట్లో యాంకర్ సుమ సరదాగా 'దోశ' ప్రస్తావన తీసుకురాగానే, రాధిక ఒక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తుచేశారు. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లగా, ఆయన స్వయంగా వేసిన దోశ తిన్నానని చెప్పారు. 'అది మల్లెపూల్లా సాఫ్ట్గా ఉంది' అంటూ నవ్వులు పూయించారు.


Click it and Unblock the Notifications











