ఆ రోజు అర్థరాత్రి సమంత చేసిన పని ఎప్పటికీ మర్చిపోలేను.. రాజ్ నిడిమోరు సోదరి ఎమోషనల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని ఆమె ఆస్వాదిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, మహిళల జీవితాలను కథాంశంగా డెరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించారు. ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే సుమారు రూ.28 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలా భారీ విజయం అందుకున్న నేపథ్యంలో సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ సంగతేంటీ?
డైరెక్టర్ రాజ్ నిడూమోరు, హీరోయిన్ సమంత 2025 డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. సమంత సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ బంగారమే అని నిరూపించే ఘటనను తాజాగా దర్శకుడు రాజ్ నిడిమోరు సోదరి, ఆమె మరదలు శీతల్ నిడిమోరు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పెళ్లైన కొన్ని రోజులకే జరిగిన ఒక ఘటన తన జీవితాంతం మర్చిపోలేనిదని ఆమె పేర్కొన్నారు. సమంత తనపై చూపిన శ్రద్ధ, ప్రేమ, ఆప్యాయత గురించి ఆమె వివరిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

శీతల్ చెప్పిన వివరాల ప్రకారం.. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చలి జ్వరం, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, మంచం దిగలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఇంట్లో వాళ్లందరూ నిద్ర పోయారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ పెట్టాలా? వద్దా? అని చాలా సేపు ఆలోచించానని, చివరకు ధైర్యం చేసి మెసేజ్ చేయగానే.. వెంటనే సమంత "నేను వస్తున్నా" అని స్పందించారని తెలిపింది. అది కూడా ఇంట్లో ఎవరినీ లేపకుండా సమంత తన గదికి వచ్చారని శీతల్ గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో దుప్పట్లు దొరకకపోవడంతో పెద్ద టవల్స్ తీసుకొచ్చి తనకు కప్పారని, మందులు, నీళ్లు అందించారని, రాత్రంతా తన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ పక్కనే ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా మరుసటి రోజు సమంతకు షూటింగ్ ఉండి కూడా ఆమె ఒక్క క్షణం అసహనం చూపలేదని పేర్కొన్నారు. అసలు తనను ఎక్కువగా కదిలించిన విషయం ఏమిటంటే.. ఆ రాత్రి సమంతకు నిద్రే లేకపోయినా, మరుసటి రోజు షూటింగ్కు వెళ్లి పూర్తి ఉత్సాహంతో పని చేయడం అని శీతల్ చెప్పారు. తాను కూడా ఆ రోజు షూటింగ్ సెట్కు వెళ్లినప్పుడు, సమంత చీరలో స్టంట్స్ చేస్తూ, నవ్వుతూ, ఎలాంటి అలసట కనిపించకుండా నటించారనీ, అది చూసి తాను ఆశ్చర్యపోయానని వెల్లడించారు.
సమంత తన దగ్గరకు వచ్చి షూటింగ్ గురించి అడగలేదనీ, ముందుగా 'నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది?' అని అడిగిందనీ, ఆ క్షణంలో సమంత ముఖంలో ఆప్యాయత, నాపై ఆందోళన కనిపించాయని గుర్తు చేసుకున్నారు. జీవితంలో అన్ని బాగున్నప్పుడు చూసుకోవడం పెద్ద విషయం కాదు. మనం బాగోలేనప్పుడు ఇతరుల కోసం ఆలోచించడం గొప్ప విషయం. సమంతలో నేను అదే చూశాను. అందుకే 'మా ఇంటి బంగారం'అనే టైటిల్ ఆమెకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం రాజ్ నిడుమోరు సోదరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications



