40 రోజులు మంచం మీదే... ఆ తప్పు ముంచేసిందంటూ రకుల్ ఎమోషనల్
ఒకప్పుడు టాలీవుడ్ను తన అంద చందాలతో మెస్మరైజ్ చేస్తూ స్టార్ హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలారు రకుల్ ప్రీత్ సింగ్. సీనియర్లు నుంచి జూనియర్ల వరకు అందరికీ ఆమె హీరోయిన్గా కావాలి అన్నంతగా ముద్రవేశారు ఈ పంజాబీ భామ. అలా కొన్నేళ్ల పాటు తెలుగుతో పాటు తమిళంలోనూ తిరుగులేని నటిగా ఒక ఊపింది రకుల్ ప్రీత్ సింగ్. కానీ తర్వాత వరుస ఫ్లాపులతో టాలీవుడ్కు దూరమైపోయింది. హిందీలోనే సినిమాలు చేసుకుంటూ అక్కడే అదృష్టాన్ని వెతుక్కుంటున్నారు. నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లాడిన ఈమె.. భర్తతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్పై రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
2009లో కన్నడంలో గిల్లి సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు రకుల్ ప్రీత్ సింగ్. నిజానికి దీనికంటే ముందే తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇవ్వాల్సింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురులో తొలుత హీరోయిన్గా రకుల్ ప్రీత్నే అనుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె ఈ ఆఫర్ను రిజెక్ట్ చేయడంతో హన్సికకి అదృష్టం వరించింది. రెండేళ్లు ఆలస్యంగా కెరటం అనే చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టారు రకుల్ ప్రీత్ సింగ్.

యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో రకుల్ ప్రీత్ సింగ్కి తొలి బ్రేక్ దక్కింది . ఆ తర్వాత టాలీవుడ్లో ఆమె కొన్నేళ్లపాటు జైత్రయాత్ర సాగించింది. అందరు స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళంలోనూ హిట్ సినిమాలలో నటించింది. కానీ అనూహ్యంగా వరుస ఫ్లాప్లు ఎదురుకావడంతో తన మకాంను ముంబైకి మార్చింది రకుల్. తెలుగులో చివరిసారిగా కొండపొలం అనే మూవీలో హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ. బూ, ఇండియన్ 2 వంటి తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగువారిని పలకరించినప్పటికీ.. స్ట్రైట్ తెలుగు మూవీలో నటించి ఐదేళ్లు కావొస్తోంది. ఇటీవల రకుల్ నటించిన దే దే ప్యార్ దే 2, పతి పత్నీ ఔర్ వో దో సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. ప్రస్తుతం కమల్ హాసన్ - శంకర్ల భారతీయుడు 3 మాత్రమే ఆమె చేతిలో ఉంది.
సినిమాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తారు రకుల్ ప్రీత్ సింగ్. తన సినిమాలు, షూటింగ్, ఇతర వ్యక్తిగత వివరాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు సెగలు రేపుతారు రకుల్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని పక్కగా ఫాలో అవుతారు రకుల్ ప్రీత్ సింగ్. దీనిలో భాగంగానే తను సంపాదనను పెట్టుబడులు, రియల్ ఎస్టేట్తో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది ఈ ముద్దుగుమ్మ. హైదరాబాద్, ముంబైలలో రకుల్ ప్రీత్ సింగ్కు ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి.
నేహా ధూపియా, అంగద్ బేడీలు జంటగా నిర్వహిస్తున్న డబుల్ డేట్ టాక్ షోకు తన భర్త, నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వతహాగా వర్కవుట్స్, ఫిట్నెస్పై ఇంట్రెస్ట్ చూపించే తాను ఒక తప్పు కారణంగా 40 రోజులు మంచానికే పరిమితమయ్యానని చెప్పింది. వర్కౌట్ సమయంలో చేసిన ఒక పొరపాటు కారణంగా డిస్క్ జారింది. దాని వల్ల వారాల తరబడి తీవ్రమైన అసౌకర్యం, మానసిక ఒత్తిడికి గురయ్యా. మీ ట్రైనర్ ఏం చెప్పినా సరే.. డెడ్ లిఫ్ట్ అనేది చేయకూడని అత్యంత చెత్త వ్యాయామం. అది కేవలం అహంకారాన్ని చూపించే లిఫ్ట్. డెడ్ లిఫ్ట్లు చేసేటప్పుడు క్రమం తప్పకుండా సేఫ్టీ బెల్ట్ వాడినప్పటికీ ఆ రోజు దానిని ధరించకూడదని నిర్ణయించుకున్నా. చివరికి ఆ నిర్ణయమే గాయానికి దారి తీసిందని రకుల్ తెలిపారు.
ఆ పొరపాటు కారణంగా నాకు స్లిప్డ్ డిస్క్ సమస్య వచ్చి దాదాపు 40 రోజుల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఎంతో చురుకుగా ఉండే నేను రోజువారీ పనుల కోసం మరొకరిపై ఆధారపడాల్సి వచ్చింది. అది కేవలం శారీరక గాయం మాత్రమే కాదు. మానసికంగానూ తీవ్రంగా ప్రభావితం చేసింది. శారీరక బాధతో సతమతవుతున్నప్పుడు ఆ పరిస్ధితి మానసికంగానూ ఎంతో ఒత్తిడిని కలిగించింది. అకస్మాత్తుగా శరీరం పనిచేయలేని స్థితిలోకి పడిపోవడం నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. ఆ కష్టకాలంలో జాకీ తనకు అండగా నిలిచారు. అలాంటి సమయంలో భాగస్వామి మద్ధతు లభించడం చాలా ముఖ్యమని రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ అవ్వగా.. జాకీ ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. జిమ్లో వర్కవుట్స్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications



