మహేష్ బాబు నన్ను తిట్టాడు.. అసలు విషయం బయటపెట్టిన నటి
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ 'వారణాసి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను మహేష్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు కెరీర్లో కీలకమైన పాత సినిమాలపై చర్చ మళ్లీ మొదలైంది. ముఖ్యంగా దర్శకుడు తేజ తెరకెక్కించిన సందేశాత్మక చిత్రం 'నిజం' గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ చేసినవారు మరెవరో కాదు... ఆ సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించిన సీనియర్ నటి రమేశ్వరి.
70, 80 దశకాల్లో హిందీ, తెలుగు చిత్రసీమల్లో హీరోయిన్గా వెలుగొందిన రమేశ్వరి, 'సీతామాలక్ష్మి' వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'నిజం' సినిమాలో ఆమె పోషించిన తల్లి పాత్ర చిన్నదైనప్పటికీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ను చూపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమేశ్వరి, ఆ సినిమా అనుభవాలను పంచుకున్నారు.

వ్యక్తిగత విషాదంలో ఉన్న సమయంలో, తల్లిని కోల్పోయి మానసికంగా కుంగిపోయిన తనకు దర్శకుడు తేజ నుంచి ఊహించని కాల్ వచ్చిందని రమేశ్వరి తెలిపారు. భర్త సూచన మేరకు మళ్లీ బయటి ప్రపంచంలోకి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ అవకాశం వచ్చిందని చెప్పారు. తేజ తనకు ఫోన్ చేసి, ఒక బలమైన పాత్ర ఉందని, నచ్చితే చేయవచ్చని చెప్పారని, హీరో ఎవరు అనే విషయం అప్పట్లో తనకు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. కథ, పాత్ర బలమే తన నిర్ణయానికి కారణమని వెల్లడించారు.
ఆ పాత్రకు ముందు జయసుధ, రేఖ వంటి ప్రముఖ నటీమణులను సంప్రదించారని, ఫిజికల్గా కష్టమైన పాత్ర కావడంతో వారు అంగీకరించలేదని రమేశ్వరి తెలిపారు. చివరకు ఆ పాత్ర తనకు రావడంతో, కథ నచ్చి వెంటనే ఒప్పుకున్నానని చెప్పారు. పారితోషికం విషయంలో ఎలాంటి డిమాండ్ చేయలేదని, వారు ఇచ్చినంతే తీసుకున్నానని స్పష్టంగా పేర్కొన్నారు.
ఇదే విషయంపై మహేష్ బాబు తనను గట్టిగా మందలించారని రమేశ్వరి ఆసక్తికరంగా వెల్లడించారు. షూటింగ్ సమయంలో తనకు అందిన రెమ్యునరేషన్ గురించి తెలుసుకున్న మహేష్ బాబు, "ఇంత తక్కువ డబ్బుకి ఎలా ఒప్పుకున్నారు? మీరు ఇంకా ఎక్కువ అడగాల్సింది" అంటూ తిట్టారని చెప్పారు. అప్పట్లో మహేష్ బాబు స్టార్ స్టేటస్ గురించి పెద్దగా తెలియదని, కృష్ణ గారి అబ్బాయి అనే విషయం మాత్రమే తెలుసునని ఆమె తెలిపారు. అయితే, ఆయన మాటల్లో తనపై ఉన్న గౌరవం, మంచి మనసు స్పష్టంగా కనిపించిందని అన్నారు.
షూటింగ్ సమయంలో మహేష్ బాబు, దర్శకుడు తేజ తన డైలాగ్ డెలివరీని సరదాగా వెక్కిరించేవారని, తాను మాత్రం పాత్రలో పూర్తిగా లీనమయ్యే వరకు డైలాగ్స్ చేస్తూనే ఉండేదాన్నని రమేశ్వరి చెప్పారు. ఒక సన్నివేశంలో తన కళ్ల నుంచి నిజంగానే కన్నీళ్లు రావడాన్ని చూసి మహేష్ బాబు ఆశ్చర్యపోయారని గుర్తు చేసుకున్నారు. తన నటనను ఆయన ఎంతో మెచ్చుకున్నారని, మహేష్ బాబు గొప్ప నటుడని కితాబిచ్చారు.
అయితే, 'నిజం' సినిమా కమర్షియల్గా డిజాస్టర్ కావడంతో, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదని రమేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు తేజే మళ్లీ ఛాన్స్ ఇవ్వలేదని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు కెరీర్లో ఓ సందేశాత్మక ప్రయోగంగా నిలిచిన 'నిజం' సినిమా జ్ఞాపకాలు, 'వారణాసి' హైప్ మధ్య మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











