కొన్నిసార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతాం.. రష్మిక మందన్న దేవరకొండ ఇన్స్పైరింగ్ స్పీచ్..
టాలీవుడ్లో నూతన స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. తాజాగా మరోసారి తమ సేవా కార్యక్రమాలతో వార్తల్లో నిలిచారు. గతంలో వారు ఇచ్చిన మాటను నెలబెట్టుకున్నారు. ప్రభుత్వ విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనందించాలనే లక్ష్యంతో 'ది దేవరకొండ ఫౌండేషన్' ద్వారా నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రష్మిక - విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించారు.
గతంలో విజయ్ దేవరకొండ తన తండ్రి స్వగ్రామమైన నాగర్కర్నూల్ జిల్లా తుమ్మన్పేటకు రష్మికతో కలిసి వెళ్లిన సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ తాజాగా అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించారు. దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 181 మంది విద్యార్థులను సత్కరించారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు రూ.10 వేల చొప్పున, సెకండ్ ర్యాంక్ సాధించిన వారికి రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులకు సరైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. జీవితంలో విజయాలు, అపజయాలు సహజమని, కానీ ప్రతి ఓటమి నుంచి ఒక కొత్త పాఠం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. తాను ఎన్నడూ క్లాస్ ఫస్ట్ , సెకండ్ రాలేదనీ, రష్మిక కూడా చదువుల్లో బెస్ట్ కాదని అన్నారు. కానీ, అనుకున్నదాని కోసం కష్టపడితే విజయం సాధించవచ్చన్నారు.
ఇక రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సభలో మాట్లాడటం ప్రారంభించిన ఆమె.. (ఈ రోజు నేను మీ ముందుకు రష్మిక మందన్న దేవరకొండగా వచ్చాను. ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది' అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఈ ఒక్క మాటతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
రష్మిక విద్యార్థులతో మాట్లాడుతూ, '9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన మీరంతా నా కంటే ముందున్నారు. ఈ విజయాల వెనుక మీ కష్టం, మీ పట్టుదల ఉంది. జీవితంలో కొన్నిసార్లు మనం గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ప్రతి అనుభవం మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి నేర్చుకుంటూ జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి'అని మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ప్రారంభించిన ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని విజయ్ దేవరకొండ, రష్మిక సంకల్పం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో అమలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రష్మిక తన పేరుతో పాటు 'దేవరకొండ'ను జోడించి పరిచయం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications




