రష్మిక మందన్నకు అవమానం.. అలా బుద్ధిచెప్పిన నేషనల్ క్రష్
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్లో అడుగుపెట్టి తన అందం, అభినయంతో పాటు వరుస విజయాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు రష్మిక మందన్న. హిందీ చిత్ర పరిశ్రమలోనూ వరుస హిట్స్తో నేషనల్ క్రష్ రేంజ్కు చేరుకున్నారు. తన బాయ్ఫ్రెండ్ విజయ్ దేవరకొండతో ప్రేమాయణానికి చెక్ పెట్టి ఆయనను పెళ్లాడారు. ఈ సక్సెస్, స్టార్డమ్ వెనుక ఎంతో కష్టం ఉంది, ఎన్నో అవమానాలు కూడా ఉన్నాయి.
కర్ణాటకలోని విరాజ్పేట్కు చెందిన రష్మిక మందన్న.. బెంగళూరులో చదువుకున్నారు. చదువు తర్వాత కిర్రాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆపై అంజనీ పుపత్ర, చమక్ సినిమాలలో నటించారు. అనంతరం ఛలో మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలతో టాలీవుడ్లో తిరుగులేని స్థానానికి చేరుకున్నారు. గుడ్బై మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి.. మిషన్ మజ్ను, యానిమల్, ఛావా, సికందర్, థామా సినిమాలతో హిందీలోనూ సత్తా చాటి నేషనల్ క్రష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో కాక్టెయిల్ 2, మైసా, రణబాలి సినిమాలు ఉన్నాయి.

గీత గోవిందం సినిమాలో తనతో కలిసి నటించిన విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిన రష్మిక మందన్న.. కొన్నేళ్లతో పాటు ఆయనతో డేటింగ్ చేశారు. తమ ప్రేమాయణాన్ని గుట్టుగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ.. రెస్టారెంట్స్, ఎయిర్పోర్ట్లలో విజయ్- రష్మికలు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు దొరికిపోయారు. తమ మధ్య ఏం లేదని, తాము స్నేహితులం మాత్రమేనని ఈ జంట చెబుతూ వచ్చింది. చివరికి పెళ్లికి ముందుకు వరకు కూడా ఇదే గోప్యతను పాటించారు రష్మిక- విజయ్ దేవరకొండ. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని జైపూర్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. తెలుగు, కొడవ సాంప్రదాయాల ప్రకారం విజయ్- రష్మికలు ఒక్కటయ్యారు.
తమ పెళ్లిని చిరస్మరణీయంగా మార్చుకోవాలని అనుకున్న ఈ జంట నిర్వహించిన కార్యక్రమాలు కూడా ప్రజల మనసులను గెలుచుకున్నాయి. విజయ్ స్వగ్రామంలో సత్యనారాయణ వ్రతంతో పాటు దేశవ్యాప్తంగా అన్నదానాలు, స్వీట్స్ పంపిణీ, అభిమానుల కోసం ప్రత్యేకంగా డిన్నర్, సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్, రష్మిక సొంతూరిలో రిసెప్షన్తో నిన్న మొన్నటి వరకు పెళ్లి వేడుకల్ని ఎంజాయ్ చేశారు కొత్త దంపతులు. ఆ తర్వాత హనీమూన్కు వెళ్లొచ్చారు విజయ్- రష్మిక. అనంతరం వీరిద్దరూ వారి సినిమా షూటింగ్స్లో పాల్గొన్నారు.
ఇదిలాఉండగా.. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రష్మిక. ఇదే సమయంలో తన కుడిచేతి మణికట్టుపై ఉన్న ఇర్రిప్లేసబుల్ అనే టాటూ గురించి యాంకర్ ప్రశ్నించింది. చాలామంది దీనిని తన భర్త విజయ్ దేవరకొండ గురించే ప్రత్యేకంగా రష్మిక వేయించుకుందని అంతా అనుకున్నారని.. కానీ దీని వెనుక వేరే కారణముంది. తొలినాళ్లలో నాకు శరీరంపై ఎలాంటి టాటూలు వేయించుకోవాలనే ఆలోచన లేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ అబ్బాయి ఆడపిల్లలు బాధను తట్టుకోలేరు, వాళ్లకు సూదులన్నా భయమేనని అవమానకరంగా మాట్లాడాడు.
అతనికి ఆడపిల్లల పట్ల, నా పట్ల ఉన్న భావన తప్పని నిరూపించడానికే నేను టాటూ వేయించుకోవాలని డిసైడ్ అయ్యా. అయితే ఏం వేయించుకోవాలో అర్ధంకాక చాలాసేపు ఆలోచించా. ఈ ప్రపంచంలో ఎవరూ మరొకరినీ భర్తీ చేయలేరు, అందరూ ముఖ్యమే. ఇదే అర్ధం వచ్చేలా ఇర్రీప్లేసబుల్ అనే పదాన్ని టాటూగా వేయించుకున్నానని రష్మిక వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... తనకు జరిగిన అవమానానికి రష్మిక ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఆడపిల్లల సత్తాను నిరూపించారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications



