'నరకం అనుభవించా.. ఇక పైకి వెళ్లే సమయం వచ్చిందనుకున్నా'
ఒకప్పుడు తెలుగు యువత హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas)ఒకరు. ఆనందం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రేఖ, ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు, దొంగోడు, జానకి వెడ్స్ శ్రీరాం, ప్రేమించుకుందాం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కన్నడ చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశారు. అక్కడ కూడా కొంతకాలం సినిమాలు చేసిన ఆమె, కెరీర్ మంచి దశలో ఉండగానే 2014లో సినీ పరిశ్రమకు దూరమయ్యారు.
చాలా కాలం తర్వాత రేఖ వేదవ్యాస్ తాజాగా యాంకర్ వర్ష హోస్ట్గా నిర్వహిస్తున్న 'కిసిక్ టాక్స్' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్, మిస్ అయిన అవకాశాలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి వంటి ఎన్నో విషయాలపై మనసు విప్పి మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముందుగా తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ.. "నాకు 'ఆనందం' సినిమా ఒక పెద్ద గుర్తింపును ఇచ్చింది. రేఖ అని చెప్పకపోయినా, 'ఆనందం రేఖ' అంటే మాత్రం అందరికీ వెంటనే గుర్తొస్తాను" అని చెప్పుకొచ్చారు. అలాగే తన కెరీర్లో చాలా మంచి అవకాశాలు కోల్పోయానని కూడా వెల్లడించారు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ నటించిన 'కలుసుకోవాలని' సినిమాలో మొదటి హీరోయిన్గా తననే ఎంపిక చేశారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని తెలిపారు.
సినిమాలకు ఎందుకు దూరమయ్యారనే ప్రశ్నకు రేఖ చాలా భావోద్వేగంగా స్పందించారు. "నేను కావాలని సినిమాలు వదిలేయలేదు. అంతా విధి రాత. మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఇంకొకటి నిర్ణయిస్తాడు. జీవితంలో ఒక దశలో చాలా బాధపడ్డాను. నరకం అనుభవించాను. ఒకప్పుడు స్టార్ హీరోలతో అవకాశాలు వస్తుంటే, ఒక్కసారిగా అన్నీ ఆగిపోయాయి. సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మంచి పాత్ర వస్తే మళ్లీ నటించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
వ్యక్తిగత జీవితంపై కూడా రేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి గురించి అడగగా నవ్వుతూ, "ఇండియాలో సల్మాన్ ఖాన్ తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉన్న రెండో వ్యక్తిని నేనే అనుకుంటా" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. "ఎందుకు పెళ్లి చేసుకోలేదు?" అనే ప్రశ్నకు, "నాకు సరిపోయే వ్యక్తి ఇంకా దొరకలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా, వాటికి తగ్గ వ్యక్తి కనిపించలేదు" అని చెప్పారు. జీవితంలో ఎవరూ పరిపూర్ణులు కాదని, తాను కూడా తప్పులు చేసే సాధారణ మనిషినేనని పేర్కొన్నారు.
ఇక ప్రేమ గురించి అడిగిన ప్రశ్నకు కూడా రేఖ నిజాయితీగా స్పందించారు. "నేను ఒక వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. కానీ సరైన సమయంలో చెప్పలేకపోయాను. చెప్పితే ఏమవుతుందో అనే భయం, సిగ్గు వల్ల నా ప్రేమను వ్యక్తం చేయలేకపోయాను. అందుకే యువతకు నా సలహా ఒక్కటే... ఎవరినైనా నిజంగా ఇష్టపడితే సరైన సమయంలో చెప్పేయండి" అని సూచించారు.
ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ.. "ఒకానొక సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డాను. శారీరకంగా ఎంతో కష్టపడ్డాను. ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ఇక నా సమయం అయిపోయింది... పైకి వెళ్లిపోయే సమయం వచ్చిందేమో అని కూడా అనిపించింది" అంటూ రేఖ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఆ క్లిష్ట పరిస్థితులను అధిగమించి ఇప్పుడు మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications




