నా పిల్లలకు నేను చెప్పేది ఒక్కటే.. అకీరా-ఆధ్యపై రేణు దేశాయ్ ఎమోషనల్!
తెలుగు ప్రేక్షకులకు రేణూ దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తక్కువ సినిమాల్లో కనిపించినప్పటికీ.. తన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, స్పష్టమైన అభిప్రాయాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఒకవైపు నటిగా, మరోవైపు దర్శకురాలు, నిర్మాత, ఎడిటర్, కాస్ట్యూమ్ డిజైనర్గా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న రేణూ దేశాయ్.. సోషల్ మీడియాలో కూడా సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఇద్దరు పిల్లల తల్లిగా అకీరా నందన్, ఆధ్యలను ఎంతో ప్రేమగా, బాధ్యతగా పెంచుతున్న రేణూ దేశాయ్.. తాజాగా పిల్లల పెంపకం, మాతృత్వం, బాధ్యతల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. తన పిల్లలకు తాను ఎప్పుడూ చెప్పే ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. "నేను నా పిల్లలకు ఒకటే చెబుతుంటాను. మీరు ఎలా ప్రవర్తిస్తారు అనేది నాపై, నా పెంపకంపై ప్రతిబింబిస్తుంది. నేను మిమ్మల్ని సరిగా పెంచానా లేదా అన్నది మీరు సమాజంలో ఎలా ఉంటారు, ఇతరులతో ఎలా మాట్లాడుతారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు మంచిగా ఉంటే.. మీరు విలువలతో జీవిస్తే.. అదే నాకు గొప్ప గౌరవం' అని అన్నారు.

అలాగే పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ముందుగా విమర్శలు తల్లిదండ్రుల పెంపకంపైనే వస్తాయని రేణూ దేశాయ్ చెప్పారు. "మీరు ఎక్కడైనా తప్పుగా ప్రవర్తిస్తే, ఎవరినైనా నొప్పిస్తే.. ముందుగా వాళ్లు మీ తల్లిని, పెంపకాన్ని ప్రశ్నిస్తారు. అందుకే నా పెంపకం మీద మచ్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని నేను వాళ్లకు చెప్పాను" అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇతరులతో ఎలా మాట్లాడాలో కూడా తాను ప్రత్యేకంగా నేర్పించానని ఆమె వెల్లడించారు.
"ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎంత గౌరవంగా ప్రవర్తించాలి అన్నది నేను ఎప్పుడూ చెబుతుంటాను. కోపం వచ్చినా, ఏదైనా బాధ కలిగినా వెంటనే ఇతరులతో అమర్యాదగా మాట్లాడొద్దు. ముందుగా నాకు ఫోన్ చేయండి.. మీ సమస్య చెప్పండి.. కానీ ఎవ్వరినీ అవమానించొద్దు అని నేర్పించాను" అని తెలిపారు.
జీవితంలో తాను మంచి నటి అయ్యానా? అందంగా ఉన్నానా? ఎంత పేరు సంపాదించానా? అన్నవి అంత ముఖ్యమేమీ కావని.. తల్లిగా ఎలా ఉన్నానన్నదే తనకు అత్యంత ముఖ్యమని రేణూ దేశాయ్ అన్నారు. "నేను మంచి నటినా కాదా, అందంగా ఉన్నానా లేదా, సమాజానికి ఎంత చేశానన్నది పక్కన పెడితే.. తల్లిగా నా బాధ్యతను ఎలా నిర్వర్తించాను అన్నదే నాకు అత్యంత ముఖ్యమైన విషయం" అని చెప్పారు.
అలాగే తన చిన్ననాట తల్లి ప్రేమలో కొంత లోటు అనుభవించానని, అందుకే అదే అనుభూతి తన పిల్లలకు రాకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. 'తల్లి ప్రేమ అంటే ఏమిటో తెలియని పరిస్థితిని నేను చెరిపేయాలనుకున్నాను. నా పిల్లలకు ఆ లోటు ఎప్పుడూ అనిపించకుండా పెంచాను. నా పిల్లలే నా ప్రపంచం.. నా జీవితంలో చాలా పెద్ద భాగం వాళ్లే' అంటూ రేణూ దేశాయ్ భావోద్వేగంగా స్పందించారు.
ఇక అకీరా, ఆధ్య గురించి మాట్లాడిన రేణూ దేశాయ్.. "నిజంగా నా పిల్లలు ఇద్దరూ చాలా మంచివాళ్లు. నేను చెప్పిన ప్రతి విషయాన్ని గౌరవంగా తీసుకుంటారు. విలువలు, మర్యాద, మనసున్న మనుషులుగా ఎదగాలని ప్రయత్నిస్తారు. వాళ్లపై నాకు ఎంతో గర్వంగా ఉంటుంది" అని తెలిపారు. రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తల్లిగా పిల్లలపై ఆమెకున్న ప్రేమ, బాధ్యత, విలువలతో పెంచాలన్న తపన చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications