ఫేమ్ కోసం ఇంత దారుణమా? ఎవర్ని వదిలేది లేదంటున్న రేణు దేశాయ్
Renu Desai : పవన్ మాజీ భార్య, టాలీవుడ్ నటి రేణు దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంగతి తెలిసిందే. ఆమె దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని తన స్టైల్ లో స్పందిస్తోంది. ముఖ్యంగా మూగ జీవాల సంరక్షణ, పర్యవరణ పరిరక్షణ కోసం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ జనాల మీద ఫైర్ అయ్యారు రేణు దేశాయ్. అంతకు ముందు కూడా ఆమెకు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై బూతులతో కామెంట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు పలువురు నెటిజన్లు.
ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు హద్దులు మీరి అసభ్యకర కామెంట్స్ పెట్టడం, ట్రోలింగ్ చేయడంతో ఈ అంశం వివాదం మారింది. ఈ నేపథ్యంలో, రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా లైవ్లోకి వచ్చి బూతులు తిడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ముందే హెచ్చరించారు. చెప్పినట్టుగానే, ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అధికారిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ కేసులో ఆరుగురికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇందులో కొందరిని వదిలిపెట్టినప్పటికీ, మరికొందరిపై చర్యలు కొనసాగుతున్నాయి.

తాజాగా రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. గతంలో లైవ్లోకి వచ్చి "నన్ను బూతులు తిడితే కచ్చితంగా అరెస్ట్ చేయిస్తాను" అని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ, తన మాటను నిజం చేశానని ఆమె స్పష్టం చేశారు. రేణు దేశాయ్ వెల్లడించిన ప్రకారం, ఇప్పటికే ఆరుగురికి పైగా ట్రోల్స్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరిని వదిలివేసినా, మిగిలిన వారిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ముఖ్యంగా, అరెస్టయిన వారిని ఎందుకు ఇలా దూషణలకు దిగుతున్నారని ప్రశ్నించగా, 'సోషల్ మీడియాలో ఫేమ్ కోసం, సెలబ్రిటీలపై తప్పుగా రాస్తే ఫాలోయింగ్ పెరుగుతుందని భావించాం' అని సమాధానం ఇచ్చారని ఆమె వెల్లడించారు. ఈ విషయమే తనను మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు.
ఈ నేపథ్యంలో, ఇకపై అరెస్ట్ అయ్యే వ్యక్తుల వివరాలను బహిరంగంగా వెల్లడించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు. అయితే, దూషణలు చేసే వారిపై చర్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 'మీరు బూతులు పెడితే అది కేవలం ఆన్లైన్లోనే ఉండదు, మీ కుటుంబం, మీ కెరీర్పై కూడా ప్రభావం పడుతుంది. అరెస్ట్ అయితే సమాజంలో మీ పేరు చెడిపోతుంది. మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ను సరిగ్గా ఉపయోగించాలి, దూషణలకు కాదు' అంటూ ఆమె గట్టిగా హెచ్చరించారు. అదేవిధంగా, అవసరమైతే ట్రోల్స్ పనిచేస్తున్న సంస్థలకు కూడా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు.
సెలబ్రిటీల పనితీరు నచ్చకపోతే విమర్శించడం తప్పు కాదని, కానీ అసభ్య పదజాలంతో దూషించడం మాత్రం నేరమని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందని మరోసారి హెచ్చరించారు. ఈ వ్యవహారంలో సహకరించిన గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, ఎవరైనా అనామకంగా దూషణలు చేస్తే తప్పించుకోలేరని, పోలీసులు సమాజం కోసం చురుకుగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ చర్యల వల్ల తనకు మళ్లీ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని చెప్పారు.
సోషల్ మీడియాలో బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని రేణు దేశాయ్ మరోసారి గుర్తుచేశారు. అభిప్రాయాలను వ్యక్తపరచడం ప్రతి ఒక్కరి హక్కే అయినప్పటికీ, అది మర్యాదపూర్వకంగా ఉండాలని, దూషణలకు దిగితే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.


Click it and Unblock the Notifications


















